Telugu doctor died in america: అమెరికాలో తెలుగు డాక్టర్ అనుమానాస్పదంగా మృతి చెందాడు. తిరుపతి జిల్లా నాయుడుపేట మండలంలోని మేనకూరుకు చెందిన పేరంశెట్టి రమేశ్ బాబు(68)ని కొంతమంది దుండుగులు కాల్చి చంపినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
వివరాల ప్రకారం..తిరుపతి ఎస్వీ వైద్య కళాశాలలో వైద్య విద్యనభ్యసించిన ఆయన..జమైకాలో ఎంఎస్ పూర్తి చేశాడు. ఆ తర్వాత అమెరికాలో వైద్యుడిగా స్థిరపడ్డాడు. ఆయనతోపాటు భారయ కూడా అక్కడే వైద్యురాలిగా పనిచేస్తున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులుండగా.. వారు అక్కడే ఉంటున్నారు.
ఇదిలా ఉండగా, కరోనా సమయంలో రమేశ్ బాబు విశేష సేవలు అందించారు. సేవలకు గానూ ఆయన పురస్కారాలు సైతం అందుకున్నారు. గతంలో తాను చదువుకున్న పాఠశాలకు రూ.14 లక్షల విరాళం అందించారు. అలాగే స్వగ్రామంలో సాయిబాబా ఆలయ నిర్మాణానికి సైతం రూ.20లక్షలు అందించారు. ఇటీవల ఏపీకి వచ్చిన ఆయన..తిరిగి అమెరికా వెళ్లిపోయారు. ఇంతలోనే ఇలా జరగడంతో కుటుంబసభ్యులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.