SpaceX NASA Astronauts| అంతరిక్షంలో 80 రోజులకు పైగా చిక్కుకున్న ఇద్దరు ఆస్ట్రోనాట్స్ సునీతా విలియమ్స్, బ్యారీ విల్మోర్ ని తిరిగి భూగ్రహంపైకి తీసుకువచ్చే బాధ్యతని ప్రముఖ బిలియనీర్ ఇలాన్ మస్క్ కు చెందని స్పేస్ ఎక్స్ కు అప్పగించినట్లు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా శనివారం ప్రకటించింది.
నాసాకు చెందిన ఇద్దరు వ్యోమగాములు సునీతా విలియమ్స్, బ్యారీ విల్ మోర్ జూన్ 5న విమాన తయారీ కంపెనీ బోయింగ్ తయారు చేసిన తొలి అంతరిక్ష స్పేస్ క్రాఫ్ట్ అయిన ‘స్టార్ లైనర్’ ని టెస్టు చేసేందుకు అందులో తొలిసారి అంతరిక్షంలోకి ప్రయాణించారు. అయితే అంతరిక్షంలో అంతర్జాతీయ స్పేస్ స్టేషన్ కు 8 రోజుల కోసం వెళ్లిన వారిద్దరూ తిరిగి రాలేకోపోయారు.
బోయింగ్ ‘స్టార్ లైనర్’ అంతరిక్ష విమానంలో టెక్నికల్ సమస్యలు తలెత్తడంతో వారిద్దరూ అక్కడే చిక్కుకున్నారు. స్టార్ లైనర్ అంతరిక్ష విమానం ప్రయాణం మొదలు పెట్టిన 24 గంటల్లోనే ఇంధనం లీక్ అయింది. అందులో ఇంధనంగా హీలియమ్ ఉపయోగిస్తారు. పైగా స్టార్ లైనర్ లోని మొత్తం 28 ‘థ్రస్టర్స్’ లో అయిదు పనిచేయడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇద్దరు నాసా వ్యోమగామలు చాలా కష్టంగా అంతర్జాతీయ స్పేస్ స్టేషన్ చేరుకున్నారు. కానీ తిరిగి భూగ్రహానికి ప్రయాణించాలంటే స్టార్ లైనర్ ప్రమాదకరమని భావించి అంతరిక్షంలోనే ఉండిపోయారు.
అయితే సివిలియన్స్ ని కూడా అంతరిక్ష ప్రయాణం చేయించేందుకే ‘స్టార్ లైనర్’ ని తయారు చేశారు. ఇదే బిజినెస్ చేసేందుకు ప్రముఖ బిలియనీర్ ఇలాన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ కంపెనీ కూడా ‘క్రూ డ్రాగన్’ (Crew Dragon) అనే అంతరిక్ష విమానం తయారు చేసింది. క్రూ డ్రాగన్ నలుగురు వ్యోమగాములను తీసుకొని సెప్టెంబర్ లో టెస్టు చేసేందుకు తొలిసారి అంతరిక్షంలో ప్రయాణించి ఫిబ్రవరిలో తిరిగి భూగ్రహానికి చేరుకుంటుంది.
ఈ నేపథ్యంలో ఇప్పుడు అంతరిక్షంలో చిక్కుకున్న వ్యోమగాములను తీసుకొచ్చేందుకు నాసా గత రెండు నెలలుగా బోయింగ్ , స్పేస్ ఎక్స్ కంపెనీలతో చర్చలు జరిపింది. బోయింగ్ సంస్థ తాము స్టార్ లైనర్ లో తలెత్తిన సమస్యలను పరిశీలిస్తున్నామని చెప్పింది. అయితే ఈ అంశంపై నాసా సంస్థ శనివారం ఆగస్టు 24న జరిపిన మీటింగ్ లో బోయింగ్ కంపెనీ ఆలస్యం చేస్తుండడం, పైగా ఎప్పుడు వ్యోమగాములను తిరిగి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తుందో స్పష్టత లేకపోవడంతో.. బోయింగ్ రైవల్ కంపెనీ స్పేస్ ఎక్స్ కు సహాయం చేయమని అడిగింది.
ఎలాగూ సెప్టెంబర్ లో స్పేస్ ఎక్స్ కు చెందిన ‘క్రూ డ్రాగన్’ అంతరిక్షంలోకి వెళ్లనుంది గనుక క్రూ డ్రాగన్ తిరుగు ప్రయాణంలో అంతరిక్షంలో చిక్కుకున్న వ్యోమగాములను భూగ్రహానికి తీసుకురావాల్సిందిగా కోరింది. నాసాకు సాయం చేసేందుకు స్పేస్ ఎక్స్ అంగీకరించింది. అయితే స్పేస్ ఎక్స్ ‘క్రూ డ్రాగన్’ లో ఇప్పుడు నలుగురికి బదులు ఇద్దరు వ్యోమగాములు మాత్రమే అంతరిక్షంలోకి వెళతారు. షెడ్యూల్ ప్రకారం ఆరు నెలల తరువాత సునీతా విలియమ్స్, బ్యారీ విల్ మూర్ ని తీసుకొస్తారు.
అంటే ప్రస్తుతం అంతరిక్షంలో చిక్కుకున్న ఇద్దరు వ్యోమగాములు ఫిబ్రవరిలో తిరిగివస్తారని నాసా స్పష్టం చేసింది.
Also Read: డిగ్రీ చదవకుండానే సంవత్సరానికి రూ.5 కోట్లు సంపాదిస్తున్న యువతి.. ఎలాగంటే?..