Amit Shah strategy against Left Wing Extremism: 2026 నాటికి దేశంలో నక్సలిజం లేకుండా చేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా వెల్లడించారు. ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్లో వివిధ రాష్ట్రాల సీనియర్ అధికారులతో అమిత్ షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 2026 మార్చి నాటికి వామపక్ష తీవ్రవాదం నుంచి దేశానికి విముక్తి కల్పిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు.
మావోయిస్ట్ తీవ్రవాదులపై చివరి దాడికి నిర్ణాయక, కఠని వ్యూహం అవసరం ఉందని అమిత్ షా చెప్పారు. హింసను నక్సల్స్ విడిచిపెట్టాలని కోరిన కేంద్ర హోం మంత్రి ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం వీరి లొంగుబాటుకు త్వరలో కొత్త విధానాన్ని ప్రకటించనున్నట్లు తెలిపింది. అయితే ప్రజాస్వామ్యానికి పెనుముప్పుగా మారిన నక్సలిజం మహమ్మారి కారణంగా దేశంలో ఇప్పటివరకు 17వేల మంది ప్రాణాలు కోల్పోయారన్నారు.
కానీ, 2004 నుంచి 2014 మధ్య కాలంతో పోల్చితే.. 2014 నుంచి 2024 మధ్యలో దేశంలో నక్సల్ సంబంధిత ఘటనల్లో సగానికి పైగా తగ్గుముఖం పట్టిందని షా వెల్లడించారు. ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత నక్సలిజం ఘటనలు 53 శాతం తగ్గుదల నమోదైందన్నారు. వామ పక్ష తీవ్రవాదాన్ని చివరి దెబ్బ తీసేందుకు భద్రతా లోపాలను సరిచేస్తున్నామన్నారు.
Also Read: ‘బీజేపీకి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటే.. మరి ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలెందుకు..?’
మావోయిస్టుల ఆర్థిక నెట్వర్క్ను దెబ్బతీసేందుకు ఎన్ఐఏ, ఈడీ వంటి విభాగాలను భద్రతా విభాగాలతో సమన్వయ పరుస్తున్నామని చెప్పారు. పక్కా ప్రణాళికతో 2026 మార్చి నాటికి వామపక్ష తీవ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలిస్తామని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో ఏడు రాష్ట్రాల అధికారులు భేటీ అయ్యారు.