– రాఖీలు కట్టడానికా?
– మహిళా కమిషన్ సభ్యులను నిలదీసిన బీజేపీ
– ఇది మహిళల్ని అవమానించడమేనని ఆగ్రహం
– స్పందించిన మహిళా కమిషన్
– ఆరుగురు సభ్యులకు నోటీసులు పంపే ఛాన్స్
Women Commission: మహిళలపై చేసిన రికార్డింగ్ డ్యాన్సుల వ్యాఖ్యలపై వివరణ ఇచ్చేందుకు మహిళా కమిషన్ ముందు హాజరయ్యారు కేటీఆర్. ఆయనతోపాటు కార్యాలయానికి మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, సత్యవతి రాథోడ్, తదితరులు వెళ్లారు. అయితే, కార్యాలయం లోపల కేటీఆర్కి రాఖీలు కట్టారు మహిళా కమిషన్ సభ్యులు. గతంలో మంత్రిగా ఉన్నప్పుడు కేటీఆర్ ప్రత్యేకంగా ఇచ్చిన నిధులతో కార్యాలయాన్ని అద్భుతంగా తీర్చి దిద్దినట్టు గుర్తు చేశారు. దీనికి సంబంధించిన వీడియోను బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, కేటీఆర్ కూడా షేర్ చేశారు.
బీజేపీ ఆగ్రహం
మహిళా కమిషన్ సభ్యులు వ్యవహరించిన తీరుపై బీజేపీ అభ్యంతరం తెలిపింది. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆపార్టీ కార్యదర్శి కొల్లి మాధవి మాట్లాడుతూ, కేటీఆర్ మహిళా కమిషన్ ముందుకు ఎందుకు వెళ్లారో గుర్తుందా? అంటూ మండిపడ్డారు. ‘‘మహిళా కమిషన్ కేటీఆర్ను ఎందుకు పిలిచింది.. విచారణ కోసమా? రాఖీలు కట్టుకోవడానికా..? మహిళా కమిషన్ కార్యాలయం బయట మాత్రం బీఆర్ఎస్, కాంగ్రెస్ మహిళలలు పోటాపోటీగా ఒకరి మీద ఒకరు నినాదాలు ఇచ్చుకున్నారు. లోపల మాత్రం రాఖీలు కట్టుకున్నారు. ఇది మహిళలను అవమానించడమే. మహిళా కమిషన్ కార్యాలయం లోపల ఒకటి, బయట మరొకటి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ప్రజలను మోసం చేసే పనిలో ఉన్నాయి’’ అంటూ విమర్శలు చేశారు.
Also Read: KTR: సారీ.. ఇంకోసారి!.. మహిళా కమిషన్ ముందుకు కేటీఆర్
వారికి నోటీసులు పంపనున్న కమిషన్
మహిళా కమిషన్ కార్యాలయం లోపల కేటీఆర్కి సభ్యులు రాఖీ కట్టడంపై కమిషన్ సీరియస్ అయింది. ఆరుగురు సభ్యులకు నోటీసులు పంపాలని చైర్ పర్సన్ నేరెళ్ల శారద సెక్రటరీని ఆదేశించారు. కమిషన్ ప్రాంగణంలో నిష్పక్షపాతంగా వ్యవహరించాలని సభ్యులకు ముందే హెచ్చరించారు. అదీగాక, మొబైల్ ఫోన్స్ అనుమతి లేకపోయినా సీక్రెట్గా తీసుకెళ్లి రాఖీ కట్టి వీడియోలు తీయడంపై మండిపడ్డారు. దీనిపై విచారణకు ఆదేశించారు. రాఖీ కట్టిన ఆరుగురు సభ్యులకు నోటీసులు ఇవ్వడంతో పాటు న్యాయ సలహా తీసుకుంటోంది కమిషన్. కమిషన్ విశ్వసనీయతను దెబ్బతీసే విధంగా ప్రవర్తించవద్దని ఆగ్రహం వ్యక్తం చేసింది. లీగల్ ఒపీనియన్ తర్వాత ఆరుగురు సభ్యులపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది.