Rangacharya: పెన్ను, గన్ను కలిపి సాగిన పయనం దాశరథి రంగాచార్య అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, సాహితీవేత్త దాశరథి రంగాచార్య జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ముఖ్యమంత్రి నివాళులర్పించారు. తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొన్న రంగాచార్య, తదనంతర కాలంలో నాటి పరిస్థితులను కళ్లకు కట్టినట్లు తన ‘‘చిల్లర దేవుళ్లు’’, ‘‘జీవనయానం’’ వంటి గ్రంథాల ద్వారా అక్షరీకరించారని ముఖ్యమంత్రి తెలిపారు. వేదాలను తెలుగులోకి అనువదించిన ఘనత రంగాచార్యదేనని అన్నారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్, నల్గొండ ఎంపీలు బలరాం నాయక్, రఘువీర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, కాంగ్రెస్ నాయకులు రోహిణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
1928, ఆగస్ట్ 24న మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండల కేంద్రంలో జన్మించారు దాశరథి రంగాచార్య. తల్లిదండ్రులు వెంకటమ్మ, వెంకటాచార్య. సాయుధ పోరాటమే ఊపిరిగా, సాహిత్యమే ఆస్తిగా దొరలు, భూస్వాముల ఆగడాలను ఎదిరించారు రంగాచార్య. వెట్టిచాకిరి నుంచి ప్రజలను విముక్తులను చేసేందుకు ఆయన ఎంతో పోరాడారు. శనివారం ఆయన స్వగ్రామంలో ఆయన జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు.
Also Read: N Convention: మనల్ని ఎవడ్రా ఆపేది..!.. ఎన్ కన్వెన్షన్ కూల్చివేత.. పూర్వపరాలు
సాంప్రదాయవాది అయిన రంగాచర్య అనూహ్యంగా కార్ల్ మార్క్స్ను అభిమానించారు. మార్క్స్ను ఆయన మహర్షిగా అభివర్ణించారు. వాస్తవానికి మార్క్సిజం, సాంప్రదాయవాదం రెండూ భిన్నధ్రువాలు. కానీ, ఈ రెంటినీ ఆయన ఒడిసిపట్టుకుని ఒక బాటన నడిపించారు, నడిచారు. ఆయన సాంప్రదాయ కుటుంబ నేపథ్యం, ఉద్యమ జీవితాలే బహుశా ఈ విలక్షణతను సంపాదించి పెట్టి ఉంటాయి.