Hydra Commissioner: ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘తమ్మిడికుంట చెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్లోని ఆక్రమణలు కూల్చివేశారు. హైడ్రా, జీహెచ్ఎంసీ, టౌన్ ప్లానింగ్, రెవెన్యూ సిబ్బంది కూల్చివేశారు. తమ్మిడికుంట చెరువులోని అనధికార నిర్మాణాల్లో ఎన్ కన్వెన్షన్ ఒకటి. చెరువులోని ఎఫ్టీఎల్ లో ఎకరా 12 గుంటలలో ఎన్ కన్వెన్షన్ నిర్మించారు. బఫర్ జోన్ లోని 2 ఎకరాల 18 గుంటల్లో ఎన్ కన్వెన్షన్ ను నిర్మించారు. ఎన్ కన్వెన్షన్ కు జీహెచ్ఎంసీ నుంచి నిర్మాణ అనుమతులు లేవు’ అంటూ రంగనాథ్ క్లారిటీ ఇచ్చారు.
Also Read: బావబామ్మర్దులు కేటీఆర్, హరీష్రావు ఇద్దరు తోడు దొంగలు: గజ్జెల కాంతం
‘తమ్మడికుంటపై 2014లో హెచ్ఎండీఏ నోటిఫికేషన్ ఇవ్వడంతో ఎన్ కన్వెన్షన్ యాజమాన్యం హైకోర్టుకు వెళ్లింది. చట్టబద్ధంగా ఉండాని గతంలో న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది. 2017లో ఎఫ్టీఎల్ సర్వే నివేదికపై కేసు ఇంకా పెండింగ్లో ఉంది. ఎన్ కన్వెన్షన్ కు సంబంధించి ఇప్పటివరకు ఏ కోర్టు స్టే ఇవ్వలేదు. ఎఫ్టీఎల్, బఫర్ జోన్ కు సంబంధించి ఎన్ కన్వెన్షన్ తప్పుదోవ పట్టించింది. తప్పుదోవ పట్టిస్తూ వాణిజ్య కార్యక్రమాలను సాగిస్తూ వచ్చింది’ అంటూ ఆయన వివరణ ఇచ్చారు.
ఇదిలా ఉంటే.. రాష్ట్ర ప్రభుత్వ భూములను కాపాడేందుకు, అక్రమ కట్టడాలు, కబ్జాదారులపై కొరడా ఝుళిపించేందుకు హైడ్రాను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో హైడ్రా దూసుకెళ్తున్నది. నగరంలోని అక్రమ కట్టడాలను గుర్తించి వాటిని కూల్చి వేస్తున్నది. ఈ క్రమంలో ఎన్ – కన్వెన్షన్ కూడ అక్రమ కట్టడంగా గుర్తించి దానిని కూల్చివేశారు హైడ్రా అధికారులు.