Deputy CM Batti Vikramarka: ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి సహా ఆయన వెంట వెళ్లిన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు కేంద్ర మంత్రులు కలిసి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చర్చించినట్లు వెల్లడించారు. ఈ క్రమంలో కేంద్ర మంత్రిని కలిసి చర్చించిన విషయాలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మీడియాకు వెల్లడించారు. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులను కేంద్ర మంత్రికి వివరించి సహాయం అందించాలని కోరినట్లు తెలిపారు. కేంద్ర ప్రాయోజిత పథకాల నిధుల విడుదలతో పాటు విభజన చట్టం ప్రకారం రావాల్సిన నిధుల గురించి గుర్తు చేశామని అన్నారు.
గత ప్రభుత్వం బడ్జెటేతర రుణాలు చేసిందని విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులే రాష్ట్ర ఖజనాపై తీవ్ర రుణ భారాన్ని మోపుతున్నాయని అన్నారు. అయితే వీటిని రీ షెడ్యూల్ చేసి కొంత ఉపశమనం కలిగించాలని కేంద్రాన్ని కోరినట్లు స్పష్టం చేశారు. రూ. 31,795 కోట్ల మేర అధిక వడ్డీకి గత ప్రభుత్వం రుణాలు చేసిందని మండిపడ్డారు. అందువల్ల వడ్డీ రేట్లు తగ్గించి రాష్ట్రాన్ని ఆదుకోవాలని కోరామని చెప్పారు. మరోవైపు జీతాల కంటే ఎక్కువ మొత్తం అప్పులపై వడ్డీకే కట్టాల్సి వస్తోందని వాపోయారు.
ఇలాంటి మొత్తం 8 అంశాలను కేంద్ర ఆర్థిక మంత్రి దృష్టికి తీసుకు వెళ్ళినట్లు భట్టి విక్రమార్క తెలిపారు. విద్యుత్ విషయంలో ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకి రావాల్సిన నిధుల గురించి గుర్తు చేశామని.. తెలంగాణలో వెనుకబడిన జిల్లాలకు గత కొన్ని ఏళ్లుగా రాష్ట్రానికి రావాల్సిన బకాయి నిధులు ఇవ్వాలని కోరినట్లు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో కేంద్ర ప్రభుత్వాధికారులకు సమావేశాన్ని ఏర్పాటు చేసి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారని అన్నారు. ఇక హైదరాబాద్ నగరం అంటేనే లేక్స్, రాక్స్ (సరస్సులు, రాళ్లు) అని వీటిని కాపాడుకోవాలంటూ పర్యావరణవేత్తలు పెద్ద ఎత్తున ఆందోళనలు కూడా చేసినట్లు తెలిపారు.
చెరువులను ఆక్రమించి నిర్మాణాలు చేయడం వల్ల ఇబ్బందులు కలుగుతున్నాయని, చెరువులు ఏవీ ఆక్రమణకు గురికాకుండా పరిరక్షించడం కోసం ఏర్పాటు చేసిందే హైడ్రా అని వెల్లడించారు. దీన్ని ప్రజలందరూ ఆహ్వానిస్తున్నారని భట్టి విక్రమార్క అన్నారు. ప్రతి పనికి నోటీసులు ఇచ్చి ఆపై చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. బఫర్ జోన్లో కాదు, నేరుగా చెరువులోనే కట్టిన నిర్మాణాలను కూడా కూల్చేస్తున్నామని అన్నారు. సాటిలైట్ ఫోటోల ద్వారా విభజనకు ముందు, విభజన తర్వాత ఈ 10 ఏళ్లలో చెరువులు ఎంత మేర ఆక్రమణకు గురయ్యాయి తెలుసుకుంటున్నాం అని చెప్పారు. రిమోట్ సెన్సింగ్ సాటిలైట్ ఫోటోలను తీసి, అంతకు ముందు ఎన్ని చెరువులు ఉండేవి, ఇప్పుడు ఎన్ని ఉన్నాయి అన్నది ప్రజల ముందు పెడతామని అన్నారు. చట్ట ప్రకారం, చట్టానికి లోబడి మాత్రమే చర్యలు చేపడతున్నామని, అన్నీ లెక్కలతో సహా ప్రజల ముందు పెడతామని, ప్రజల ఆస్తులను కాపాడడం ప్రభుత్వ బాధ్యత అని ఆయన అన్నారు.