N Convention Demolition: అక్కినేని నాగార్జున అంటే తెలియనివారు ఉండరు. ఆయన మంచి నటుడు మాత్రమే కాదు.. పేరొందిన వాణిజ్యవేత్త కూడా. తాజాగా హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ (HYDRA) చేపట్టిన అక్రమ కట్టడాల జాబితాలో నాగార్జునకు చెందిన N-కన్వెన్షన్ సెంటర్ కూడా ఉంది. హైడ్రా అధికారులు శనివారం ఉదయం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య N-కన్వెషన్ కూల్చివేత పనులు చేపట్టారు. మధ్యాహ్నం కల్లా మొత్తం కట్టడాన్ని కూల్చివేశారు.
10 ఎకరాల విస్తీర్ణంలో..
సైబరాబాద్లోని మాదాపూర్ ప్రాంతంలో 10 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఎన్-కన్వెన్షన్ సెంటర్ ఉంది. అయితే, అక్కడి తమ్మిడికుంట చెరువును ఆక్రమించి ఈ నిర్మాణాలు చేపట్టారని ఎన్నో ఏళ్ల నుంచి ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై అధికారులు గానీ, గత ప్రభుత్వం గానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ సెంటర్.. చెరువుకు సంబంధించిన బఫర్ జోన్, ఫుల్ ట్యాంక్ లెవల్ (FTL) ప్రాంతం మొత్తాన్ని ఆక్రమించి నిర్మించినట్లు హైడ్రా అధికారులు చెబుతున్నారు. మొత్తం చెరువు విస్తీర్ణం.. 29.24 ఎకరాలు. ఇందులోని 1.2 ఎకరాలు FTL, 2 ఎకరాలు బఫర్ జోన్లను ఆక్రమించి ఈ సెంటర్ నిర్మించినట్లు పేర్కొన్నారు. దీనిపై GHMCకి ఎన్ని ఫిర్యాదులు అందినా పట్టించుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. తాజాగా మంత్రి కొమటిరెడ్డి వెంకట రెడ్డి ఫిర్యాదు దీనిపై ఫిర్యాదు చేయడంతో హైడ్రా రంగంలోకి దిగి ఈ కూల్చివేతలను చేపట్టింది. పూర్తి ఆధారాలు సేకరించిన తర్వాత ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు.
Also Read: ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై నాగార్జున ఎమోషనల్ ట్వీట్..
N-కన్వెషన్ సెంటర్ ప్రత్యేకతలు ఏమిటి?
పెళ్లిళ్ల నుంచి సదస్సులు, సమావేశాల వరకు ఎలాంటి వేడుకలనైనా ఈ ఎన్ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించుకోవచ్చు. కేవలం సంపన్నులు మాత్రమే ఇక్కడి రేట్లను భరించగలరు. ఎందుకంటే కన్వెన్షన్ సెంటర్ బుకింగ్స్ నుంచి మీల్స్ వరకు ప్రతి ఒక్కటీ ఖరీదైనదే. ఈ కన్వెన్షన్ ద్వారా అక్కినేని నాగార్జునకు మంచి ఆదాయమే లభిస్తున్నట్లు సమాచారం. ఎందుకంటే.. ఇక్కడ ఒక్క ఫంక్షన్ నిర్వహించాలంటే సుమారు రూ.10 లక్షలకు పైగా చెల్లించాలని తెలిసింది. అయితే, అది అక్కడ నిర్వహించే సెలబ్రేషన్స్ ప్యాకేజీ, అతిథుల సంఖ్య, హాల్ కెపాసిటీ తదితర అంశాలపై ఆధారపడి ఉంటుంది. అక్కడ వేడుకల్లో సెర్వ్ చేసే మీల్స్ ధర.. ఒక్క ప్లేట్కు సుమారు రూ.1400 పైగా ఉంటుందని సమాచారం.
ఈ సెంటర్లో రెండు పెద్ద ఏసీ హాల్స్ ఉన్నాయి. ఇందులోని మెయిన్ హాల్ సుమారు 27,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ఇందులో సుమారు 2500 మంది కుర్చొనే వీలుంది. ఇందులో కూర్చొని లేక్ అందాలను వీక్షిస్తూ సెలబ్రేషన్స్ ఎంజాయ్ చేయవచ్చు. రెండో హాల్లో 500 మంది వరకు కూర్చొనే వీలుంది. ఇది కాకుండా గార్డెన్ ఏరియా, ఎన్-డైమండ్ పేరుతో మరో లగ్జరీ హాల్ కూడా ఉన్నాయి. ఒకే రోజు సుమారు 3 వేడుకలను నిర్వహించుకోగలిగే వీలుంటుంది.
Also Read: హైకోర్టుకు నాగార్జున.. ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై స్టే
ఏడాదికి అంత ఆదాయమా?
ఈ సెంటర్ నిర్మించి సుమారు 10 ఏళ్లు పైనే అవుతుంది. ఇక్కడ ఫంక్షన్ల నిర్వాహనకు సుమారు రోజుకు రూ.1.7 నుంచి రూ.2 కోట్ల వరకు (గెస్టుల కెపాసిటీ, ఫంక్షన్ బట్టి) వసూళ్లు చేస్తారని సమాచారం. అయితే, ఇది తక్కువలో తక్కువ అంచనా. పెళ్లిల్ల సీజన్లో ఆదాయం ఇంతకు మించి కూడా ఉండవచ్చు. విస్వసనీయ సమాచారం ప్రకారం.. ఎన్ కన్వెన్షన్ నుంచి ఏడాదికి వచ్చే ఆదాయం సుమారు రూ.350 కోట్ల వరకు ఉంటుందట. అంటే ఆయన గత పదేళ్లలో సుమారు 4 వేల కోట్ల వరకు సంపాదించి ఉండవచ్చని తెలుస్తోంది. అయితే, ఇది కేవలం అంచనాలు మాత్రమే. తాజా కూల్చివేతల వల్ల నాగార్జునకు భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉంది. అయితే, నాగార్జున దీనిపై కోర్టులో పోరాడేందుకు సిద్ధమయ్యారు. అది పట్టా భూమి అని, ట్యాంక్ ప్లాన్లో ఒక్క అంగుళం కూడా ఆక్రమించలేదని ఆయన స్పష్టం చేశారు. అది అక్రమం అని తెలిస్తే బాధ్యతగల పౌరుడిగా తానే కూల్చివేసేవాడినని నాగార్జున పేర్కొన్నారు.