Nagarjuna: సినీ నటుడు నాగార్జున్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. హైడ్రా అధికారులు ఈ రోజు ఉదయం మాధాపూర్లోని ఎన్ కన్వెన్షన్ను కూల్చివేయడంపై ఆయన పిటిషన్ వేశారు. ఆయన హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేయగా.. జస్టిస్ టి వినోద్ కుమార్ విచారణ చేపట్టారు. ఎన్ కన్వెన్షన్ తరఫున సీనియర్ అడ్వకేట్ పీ శ్రీ రామ్ వాదనలు వినిపించారు. విచారణ అనంతరం, హైకోర్టు ధర్మాసనం ఈ కూల్చివేతలు ఆపాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
తుమ్మిడికుంట చెరువును ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ నిర్మించారని, ఎన్ కన్వెన్షన్ ఫుల్ ట్యాంక్ లెవెల్(ఎఫ్టీఎల్), బఫర్ జోన్లో ఉన్నదని ఆరోపణలు వచ్చాయి. మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి కూడా ఇలాంటి ఫిర్యాదులు చేశారు. గతంలోనూ ఇలాంటి ఆరోపణలు వచ్చాయి. అప్పుడు కూడా ఎన్ కన్వెన్షన్ నిర్వాహకులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
తాజాగా, ఈ ఫిర్యాదుల నేపథ్యంలో హైడ్రా అధికారులు రంగంలోకి దిగారు. శనివారం ఉదయమే ఎన్ కన్వెన్షన్ చేరుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ఎన్ కన్వెన్షన్ను కూల్చివేశారు. కూల్చివేత సజావుగా సాగేందుకు పెద్ద సంఖ్యలో పోలీసులూ అక్కడికి చేరుకున్నారు. మధ్యాహ్నం నాటికి దాదాపుగా ఎన్ కన్వెన్షన్ పూర్తిగా నేలమట్టమయింది.
Also Read: Hydra next target: హైడ్రా నెక్ట్స్ టార్గెట్.. లోటస్పాండ్.. జగన్ ఇంటిని కూడా..
కాగా, నాగార్జున మాత్రం ఈ ఆరోపణలను కొట్టిపారేస్తున్నారు. తాము ఎలాంటి ఆక్రమణలకు దిగలేదని, కూల్చివేత నిబంధనలకు విరుద్ధంగా చేపట్టారని పేర్కొన్నారు. కోర్టు స్టే ఆర్డర్ ఉన్నప్పటికీ అధికారులు ఆ ఆదేశాలను పక్కనపెట్టి కూల్చివేత చేపట్టారని సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. తాము ఎలాంటి ఆక్రమణలకు, నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడలేదని తెలిపారు.
తుమ్మిడి కుంట చెరువు దాదాపు 29.24 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నది. ఇందులో ఎఫ్టీఎల్ ఏరియాలో 1.12 ఎకరాలను ఎన్ కన్వెన్షన్ ఆక్రమించిందని, అలాగే..బఫర్ జోన్లోని మరో 2 ఎకరాలను ఆక్రమించినట్టు అధికారులు చెబుతున్నారు. ఈ ఆరోపణలు కొన్ని సంవత్సరాలుగా వస్తూనే ఉన్నాయి. హైదరాబాద్ నగరంలో ఆక్రమణలకు అడ్డుకట్ట వేయడానికి, ఇతర ముఖ్యమైన బాధ్యతలతో కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసింది. కమిషనర్ రంగనాథ్ ఆధ్వర్యంలో హైడ్రా దూకుడుగా చర్యలు తీసుకుంటున్నది. అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేస్తున్నది.