Roja: వైసీపీ నేత, మాజీ మంత్రి రోజా ఎక్కడ? ఇంతకీ ఆమె ఏపీలో ఉన్నారా? లేక చెన్నైకి షిఫ్ట్ అయ్యారా? అధినేత విజయవాడకు వచ్చినా ఎందుకు కలవలేదు? పార్టీ మారే ఆలోచన చేస్తున్నారా? ఇంతకీ ఏ పార్టీ వైపు చూస్తున్నారు? బీజేపీ, జనసేన లేకుంటే మరేదైనా పార్టీలోకి వెళ్తున్నారా? ఇవే ప్రశ్నలు ఆమె అభిమానులను వెంటాడుతున్నాయి.
రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. ఓడలు బళ్ళు.. ఒళ్ళు ఓడలవుతాయి. ప్రస్తుతం మాజీ మంత్రి రోజా పరిస్థితి కూడా అంతే అనుకోండి. గడిచిన పదేళ్లు వైసీపీ నేత, మాజీ మంత్రి, నటి రోజాకు స్వర్ణయుగం. వైపీసీ విపక్షంలో ఉన్నప్పుడు.. అధికార టీడీపీపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యేవారు. దీంతో ఫ్యాన్ పార్టీలో ఫైర్ బ్రాండ్ అయ్యారామె. ఆ మాటలే గత ప్రభుత్వంలో మంత్రి పదవి వరించేలా చేసింది. ఆఫ్కోర్సు.. రాజకీయాలు అన్నాక ఒడిదుడుకులు తప్పవనుకోండి.
ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరి దాదాపు రెండునెలలు గడిచిపోయాయి. అధికార-విపక్షాల మధ్య మాటల యుద్ధం మొదలైంది. పలుమార్లు జగన్ మీడియా ముందుకు రావడం జరిగింది. కనీసం అధినేతను సైతం కలవలేదు. మీడియా ముందుకు కూడా రాలేదు మాజీ మంత్రి రోజా. కారణాలు ఏమైనా అనుకోండి. ఆమె సైలెంట్గా ఉండటాన్ని గమనించిన ఆ పార్టీ నేతలు.. రోజా పార్టీ మారే అవకాశముందని చర్చించుకోవడం మొదలైంది.
ALSO READ: జైలు నుంచి విడుదలైన మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి.. కంటతడి పెట్టిన కొడుకు.. నేరుగా అక్కడికి..
ఇంతకీ మాజీ మంత్రి రోజా ఏ పార్టీలోకి వెళ్తున్నారు? టీడీపీ లేక జనసేనా? ఇవే ప్రశ్నలు ఆమె అభిమానులను వెంటాడుతున్నాయి. ఈ రెండు పార్టీలపై విరుచుకుపడే రోజా, అటువైపు వెళ్లదని అంటున్నారు. పొరుగురాష్ట్రంపై కన్నేసిందని అంటున్నారు. అదే తమిళనాడు రాజకీయాల వైపు దృష్టి పెట్టిందని అంటున్నారు. ఇందుకు కారణాలు లేకపోలేదు. రీసెంట్ తమిళనాడులో నటుడు విజయ్ కొత్త పార్టీ పెట్టారు. రెండు రోజుల కిందట పార్టీ జెండాను రివీల్ చేశారు.
తమిళనాడు రాజకీయాలనగానే రీజనల్ పార్టీలదే ఆధిపత్యం. ఇప్పటికే అక్కడ అధికార డీఎంకె, విపక్ష అన్నాడీఎంకె పార్టీలున్నాయి. ఇప్పుడు కొత్తగా విజయ్ పార్టీ. ఇప్పటికే ఆయన గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. ప్రజల్లో కాస్త ఫేమ్ ఉన్నవారిని పార్టీకి తీసుకోవాలని ఆలోచన చేస్తున్నారు. ఈ క్రమంలో రోజా అటు వెపు కర్చీఫ్ వేసిందన్నది నేతల మాటల వెనుక సారాంశం.
రోజా.. తెలుగు కంటే తమిళంలో ఎక్కువ సినిమాలు చేసింది. పైగా ఆమె భర్త సొంతూరు కూడా తమిళనాడు. ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ అక్కడ అడుగుపెట్టాలని ఆలోచన చేస్తోందట. మరి తమిళతంబీలు ఈమెని ఆకట్టుకుంటారా? అన్నదే అసలు పాయింట్.
అన్నట్లు ఆ మధ్య తమిళ సూపర్స్టార్ రజనీకాంత్.. ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు ఏపీకి వచ్చినప్పుడు ఆయనపై విరుచుకుపడ్డారామె. ఆ సమయంలో తమిళ తంబీలు ఈమెపై కాసింత ఆగ్రహంగా ఉన్నారు. ఒకవేళ తమిళనాడు రాజకీయాల్లోకి వెళ్తే తమిళ ప్రజలు రోజాను ఆదరిస్తారా? అన్నదే అసలు పాయింట్. చూద్దాం.. రాజకీయాల్లో ఏమైనా జరుగుతాయి.