TPCC chief post: తెలంగాణ కొత్త పీసీసీ అధ్యక్షుడు ఎవరు? కాంగ్రెస్ హైకమాండ్ ఎవరి వైపు మొగ్గు చూపింది? అసలు ఢిల్లీలో ఏం జరిగింది? రేపో మాపో ప్రకటన వస్తుందా? ఇవే ప్రశ్నలు తెలంగాణ కాంగ్రెస్ నేతలను వెంటాడుతోంది.
రెండురోజుల కిందట ఢిల్లీకి వెళ్లారు సీఎం రేవంత్రెడ్డి. టీపీసీసీతోపాటు మంత్రివర్గాన్ని విస్తరించాలని నిర్ణయానికి వచ్చారు. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం ఢిల్లీకి వెళ్లారు. శుక్రవారం మధ్యాహ్నం ఏఐసీసీ ఆఫీసులో పార్టీ చీఫ్ ఖర్గే, అగ్రనేత రాహుల్గాంధీ, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, తెలంగాణ ఇన్ ఛార్జ్ దీపాదాస్ మున్షీలతో సీఎం రేవంత్, మంత్రులు భట్టి, ఉత్తమ్లతో సమావేశమయ్యారు.
టీపీసీసీ నేతను ఎవరిని ఎంపిక చేయాలన్న దానిపై తెలంగాణ నేతల నుంచి అభిప్రాయాలు సేకరించారు. దీనిపై దాదాపు గంటసేపు చర్చించారు. అందరితో కలిసి చర్చించిన తర్వాత విడివిడిగా అభిప్రాయాలు తీసుకుంది హైకమాండ్. ఈసారి బీసీలకు ప్రయార్టీ ఇవ్వాలనే ఆలోచనను బయటపెట్టింది. ఈ క్రమంలో మహేష్కుమార్ గౌడ్- మధుయాష్కీ పేర్లు వెలుగులోకి వచ్చాయి. వీరిద్దరు బీసీకి చెందిన నేతలు. వీరి గురించి డీటేల్స్ అడిగి తీసుకున్నట్లు ఢిల్లీ సమాచారం.
ALSO READ: బిజీబిజీగా సీఎం ఢిల్లీ టూర్
క్రియాశీలకంగా ఉన్న వ్యక్తిని నియమించాలని చెప్పినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నమాట. తొలుత పీసీసీ వ్యక్తి ఎవరన్నది తెలిసిన తర్వాత అప్పుడు మంత్రి పదవుల గురించి నిర్ణయం తీసుకుందామని హైకమాండ్ అన్నట్లు సమాచారం.
మహేష్కుమార్- మధుయాష్కీ గురించి చెప్పనక్కర్లేదు. ఇద్దరు నేతలు పార్టీని నమ్ముకున్నారు. పైగా ఇద్దరిదీ ఒకటే సామాజికవర్గం. మధుయాష్కీకి కాంగ్రెస్ పెద్దలతో మంచి సంబంధాలు ఉన్నాయి. కాకపోతే 2029 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అన్నివిధాలుగా సరైన వ్యక్తిని నియమించాలని భావిస్తోంది. వీరితోపాటు కొందరు బీసీ నేతలకు చెందిన వివరాలు తీసుకుంది హైకమాండ్.
ఇవాళ గానీ రేపు గానీ కొత్త టీపీసీసీ నేత ఎవరనే దానిపై ఏఐసీసీ ప్రకటన చేయనుంది. కాంగ్రెస్ పార్టీలో ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ. 2029 ఎన్నికల లక్ష్యంగా ఇప్పటినుంచి అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఎవరనేది ఆసక్తికరంగా మారింది.