Jagan Vs Atchannaidu: వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. నిస్సిగ్గుగా ప్రవర్తించొద్దంటూ ఆయనపై మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఘటనపై ప్రభుత్వం వెంటనే స్పందించిందన్నారు. బాధితులకు అన్ని విధాలుగా అండగా నిలిచినప్పటికీ, కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేతలు నిస్సిగ్గుగా దుష్ర్పచారం చేస్తున్నారంటూ మంత్రి అచ్చెన్నాయుడు సీరియస్ అయ్యారు. ధర్నా చేస్తానని జగన్ ప్రకటించడం దేనికి సంకేతమంటూ జగన్ ను ప్రశ్నించాంరు. వైసీపీ హయాంలో ప్రజలు పరిహారం కోసం రోడ్డెక్కి ధర్నా చేశారంటూ ఆయన గుర్తుచేశారు.
Also Read: “చంద్రబాబు మాటలు విని షాకయ్యా.. మా హయాంలోనూ ఇలాంటి ప్రమాదమే జరిగింది”
ఇదిలా ఉంటే.. అచ్యుతాపురం ఘటనపై జగన్ మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనకాపల్లిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఆయన పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
అచ్యుతాపురం ఘటన బాధాకరమన్నారు. ఈ ఘటనలో ప్రభుత్వ తీరు సరికాదన్నారు. ఘటన జరిగింది రాత్రి కాదు.. పట్టపగలే జరిగిందన్నారు. అయినా రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్నారు. హోంమంత్రి పర్యవేక్షణకు వెళ్తున్నాను అన్న మాటే లేదన్నారు. ఘటనకు సంబంధించి కార్మిక శాఖ మంత్రి దగ్గర కూడా వివరాలు లేవన్నారు. వారికి ఎంతమంది చనిపోయారో తెలియదన్నారు. మొత్తంగా ఈ ఘటనపై ప్రభుత్వం స్పందించకూడదన్న తాపత్రయం కనిపించిందన్నారు. ఘటనా స్థలికి అంబులెన్సులు కూడా రాని పరిస్థితి నెలకొన్నదన్నారు. దీంతో బాధితులను కంపెనీ బస్సులోనే తీసుకొచ్చారన్నారు.
ఇలాంటి ఘటనే తమ హయాంలో జరిగిందని.. అదీ కోవిడ్ సమయంలో జరిగినా.. ఘటన జరిగిన 24 గంటల్లోనే పరిహారం ఇప్పించామన్నారు. కోటి రూపాయల పరిహారం ఇచ్చిన మొదటి గవర్నమెంట్ తమదేనన్నారు. ప్రభుత్వం జరిగిన వెంటనే తమ పాలక, ప్రభుత్వ యంత్రాంగం వెంటనే స్పందించిందన్నారు. కూటమి ప్రభుత్వంలా తాము వ్యవహరించలేదన్నారు. ఘటన జరిగిన కాసేపటికే కలెక్టర్ ఘటనా స్థలికి వెళ్లారన్నారు జగన్. తాను ఉదయం 11 గంటలకు ప్రమాద స్థలానికి వెళ్లినట్లు చెప్పారు. గంటల్లోనే రూ. 30 కోట్ల పరిహారం సొమ్ము పంపినట్లు చెప్పారు. గతంలో కూడా ఏ ప్రభుత్వం కూడా ఆ మాదిరిగా స్పందించలేదన్నారు. కానీ, ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం స్పందించిన తీరు చూస్తుంటే చాలా బాధ వేస్తుందన్నారు. ఫ్యాక్టరీలో ప్రమాదం ఎలా జరిగిందనేదానిపైన చాలా లోతైన దర్యాప్తు చేపట్టాలన్నారు.
Also Read: మహిళా సర్పంచ్ సంయుక్తపై పవన్ ప్రశంసల వర్షం.. ఎందుకంటే..?
పరిహారం అనేది సానుభూతితో మాత్రమే ఇవ్వాలన్నారు.. అది కూడా ఇవ్వాల్సిన సమయంలోనే ఇవ్వాలన్నారు. కానీ, ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం బాధితులకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. ఇవ్వాల్సిన పరిహారం వెంటనే బాధితులకు ఇవ్వాలన్నారు. అదేవిధంగా రాష్ట్రంలోని పరిశ్రమల్లో ప్రమాదాలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలంటూ ప్రభుత్వాన్ని కోరారు. ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా తగిన చర్యలు చేపట్టాలన్నారు. ఈ ఘటనలో బాధితులకు పరిహారం ఇవ్వకపోతే తానే వచ్చి స్వయంగా ధర్నా చేసి బాధితులకు అండగా ఉంటనన్నారు.
అయితే, ఘటనపై సీఎం చంద్రబాబు ప్రెస్ మీట్ చూసి తాను ఆశ్చర్యపోయినట్లు చెప్పారు. ఇష్యూను డైవర్ట్ చేసేందుకే చంద్రబాబు ప్రయత్నించారన్నారు. ప్రభుత్వం అనేది బాధ్యతతో వ్యవహరించాలన్నారు. కానీ, ప్రస్తుత ప్రభుత్వం అలా వ్యవహరించలేదన్నారు. ప్రభుత్వం పరిశ్రమలపై పర్యవేక్షణ చేసి ఉంటే ఈ ప్రమాదం జరిగి ఉండేదికాదన్నారు. ప్రస్తుత ప్రభుత్వ ధ్యాస అంతా రెడ్ బుక్ పైనేనన్నారు. రెడ్ బుక్ మీద పెట్టిన శ్రద్ధ.. ఇటువంటి వాటిపైన పెట్టి ఉంటే ఇలాంటి ఘటనలు జరిగి ఉండేవి కావంటూ జగన్ పేర్కొన్న విషయం తెలిసిందే.