– కాంగ్రెస్లోనే బీఆర్ఎస్ విలీనం
– బీజేపీలోకి రావాలంటే రిజైన్ చేయాల్సిందే
– కేసీఆర్ ఫ్యామిలీకి బీజేపీలో చోటులేదు
– సగమంందికీ రైతు రుణమాఫీ కాలే…
– అర్థంలేని కండిషన్లతో రైతులకు పంగనామం
– సత్తా ఉన్నోళ్లకే బీజేపీ రాష్ట్ర బాధ్యతలియ్యాలె..
– ఆర్మూరు రైతు ధర్నాకు బీజేపీ సంపూర్ణ మద్దతు
– నిజామాబాద్ ప్రెస్మీట్లో ఎంపీ ధర్మపురి అరవింద్
BJP : బీజేపీ సిద్ధాంతాలు, విలువకు కట్టుబడే వ్యక్తులకే పార్టీ అధిష్ఠానం రాష్ట్ర పార్టీ బాధ్యతలు అప్పగించాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అభిప్రాయపడ్డారు. శుక్రవారం నిజామాబాద్లో ఎంపీ అరవింద్ మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ నేతలు ఢిల్లీలో బీజేపీ నేతలతో చర్చలు చేస్తున్నారనే వార్తల్లో వాస్తవం లేదని, మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులను ఏనాటికీ తమ పార్టీలో చేర్చుకునేది లేదని ఆయన స్పష్టం చేశారు. రుణమాఫీ మీద కాంగ్రెస్ పార్టీ చేసుకుంటున్న ప్రచారంపై ఆయన మండిపడ్డారు.
చచ్చినా చేర్చుకోం..
బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం కాబోతుందన్న వార్తలపై అరవింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. అది జరిగే పనే కాదన్నారు. ఆరునూరైనా కేసీఆర్ కుటుంబ సభ్యులను ఏనాటికీ బీజేపీలో చేర్చుకోబోమని స్పష్టం చేశారు. ప్రస్తుత రాజకీయాల్లో ఓ పార్టీలో గెలిచి మరో పార్టీలో చేరుతున్నారని, ఇప్పటికే పదిమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరిపోయారని గుర్తుచేశారు. ఒకవైపు గులాబీ పార్టీ కాంగ్రెస్లో విలీనం అవుతుంటే.. బయట మాత్రం బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అనే ప్రచారం జరుగుతోందన్నారు. బీఆర్ఎస్లోని మిగిలిన ఎమ్మెల్యేలు ఏ పార్టీలో చేరతారో తమకు సంబంధం లేదని, తమ పార్టీలో చేరాలంటే మాత్రం తమ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సిందేనని ఇప్పటికే కేంద్రమంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారని గుర్తుచేశారు.
రాష్ట్ర అధ్యక్ష పదవిపై..
బీజేపీ సిద్ధాంతాలు, విలువకు కట్టుబడే వ్యక్తులకే పార్టీ అధిష్ఠానం.. రాష్ట్ర పార్టీ బాధ్యతలు అప్పగించాలని అరవింద్ అభిప్రాయపడ్డారు. ఎన్నికల సమయంలో పార్టీ తరపున బరిలో దిగిన వారిని గెలిపించగల సత్తా ఉన్నవారికే నాయకత్వ బాధ్యతలు అప్పగించాలని సూచించారు. వచ్చే మహారాష్ట్ర ఎన్నికల్లో తనకు నాందేడ్ జిల్లా ఇన్ఛార్జ్గా పార్టీ తనకు బాధ్యతలు అప్పగించిందని వెల్లడించారు. మహారాష్ట్ర ఎన్నికల్లో పార్టీ విజయం సాధించనుందని చెప్పుకొచ్చారు.
Also Read: Farm Loan Waiver: డోంట్ వర్రీ.. అందరికీ మాఫీ చేస్తాం.. కటాఫ్ డేట్ పెడ్తాం: మంత్రి పొంగులేటి
అంతా హంబక్..
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు రుణమాఫీ అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని అరవింద్ విమర్శించారు. కనీసం సగం మందికి కూడా రుణమాఫీ జరగలేదని క్షేత్రస్థాయి రైతాంగం చెబుతోందన్నారు. నిజామాబాద్ జిల్లాలో రైతు రుణమాఫీ కేవలం 30 శాతం మాత్రమే జరిగిందని వివరించారు. లక్షలాది మంది రైతులు రుణమాఫీ వస్తుందని ఆశ పడగా, లేని పోని కండిషన్లు పెట్టటంతో సగం మంది రైతులు నిరాశచెందాల్సి వచ్చిందన్నారు. పదేళ్లు ప్రజలను మోసం చేసిన కేసీఆర్ పాలనకు, ఈ ప్రభుత్వ పాలనకు పెద్ద తేడా ఏమీ లేదన్నారు. ఇకనైనా ప్రభుత్వం ఎలాంటి షరతులు లేకుండా తక్షణమే రుణాలు మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి రొటేషన్ చక్రవర్తిలా రాష్ట్రాన్ని పాలిస్తున్నారని వ్యాఖ్యానించారు.
Also Read: Kolkata Incident: కోల్కతా ట్రైనీ డాక్టర్ బాడీ వద్ద చిరిగిన డైరీ.. అందులో ఏముందంటే ?
నేటి ధర్నాకు మద్దతు..
సంపూర్ణ రుణమాఫీ కోసం శనివారం ఆర్మూర్, నిజామాబాద్ రూరల్, బాల్కొండ నియోజకవర్గ రైతాంగం చేపట్టనున్న ధర్మాకు తమ పార్టీ పూర్తి మద్దతునిస్తుందని అరవింద్ స్పష్టం చేశారు. గతంలో ఎర్ర జొన్న మద్దతు ధర కోసం ఉద్యమించి తూటాలకు ఎదురు నిలిచిన ఆర్మూర్ ప్రాంత రైతులు మరో మారు కాంగ్రెస్ సర్కార్ పై పోరుబాటకు సిద్ధమవుతున్నారని, ఇకనైనా ప్రభుత్వం బేషరతుగా అందరు రైతులకు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో గతంలో గుజరాత్ సీఎంగా ఉండగా మోడీ రైతులకు వడ్డీ లేని రుణాలు ఇచ్చారని గుర్తుచేశారు.