Women Commission: మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేపు మహిళా కమిషన్ ముందు విచారణకు హాజరుకానున్నారు. ఈ విషయాన్ని కేటీఆర్ స్వయంగా వెల్లడించారు. రేపు తాను మహిళా కమిషన్ విచారణకు హాజరవుతానని వివరించారు. రేపు మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో విచారణకు హాజరు కానున్నట్టు సమాచారం.
ఉచిత బస్సు ప్రయాణంలో మహిళలు ఉల్లి పాయలు వలుస్తున్నారని, అల్లికలు చేసుకుంటున్నారని కేటీఆర్ గతంలో కామెంట్ చేశారు. అలా చేస్తే తప్పని తాము చెప్పడం లేదని, కానీ, ఘర్షణలు జరుగుతున్నాయని, బస్సుల సంఖ్య పెంచాలని ప్రభుత్వాన్ని కోరారు. అదే సందర్భంలో ఆయన ఉచిత బస్సు ప్రయాణంలో వారు అల్లికలు, కుట్టులు పెట్టుకున్నా తమకే అవసరం లేదని, రికార్డింగ్ డ్యాన్సులు, బ్రేక్ డ్యాన్సులు వేసినా తమకు అవసరం లేదని కామెంట్ చేశారు.
ఈ వ్యాఖ్యలపై మహిళా లోకం భగ్గుమంది. తెలంగాణ మహిళలు బ్రేక్ డ్యాన్సులు, రికార్డింగ్ డ్యాన్సులు వేసేలా కనిపిస్తున్నారా? అని మండిపడింది. మహిళా మంత్రులు కూడా కేటీఆర్ పై విరుచుకుపడ్డారు. ఆయన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు రావడంతో కేటీఆర్ కూడా వెనక్కి తగ్గారు. ట్విట్టర్ వేదికగా.. క్షమాపణలు చెప్పారు. తాను ఎవరినీ ఉద్దేశించాలని అనుకోలేదని, ముఖ్యంగా తెలంగాణ మహిళలను తాను ఎప్పుడూ కించపరచనని పేర్కొన్నారు. తన వ్యాఖ్యలతో ఎవరైనా ఇబ్బంది పడితే అందుకు తన క్షమాపణలు అని ట్వీట్ చేశారు.
Also Read: Double Ismart Losses: భారీ నష్టాల్లో హనుమాన్ ప్రొడ్యూసర్.. కొత్త ఆఫర్ తీసుకొచ్చిన పూరీ!
ఈ వ్యాఖ్యలను రాష్ట్ర మహిళా కమిషన్ సుమోటోగా తీసకుంది. కేటీఆర్కు నోటీసులు పంపింది. ఈ నోటీసులకు కేటీఆర్ స్పందించారు. రేపు మహిళా కమిషన్ ముందు విచారణకు హాజరుకానున్నారు.