Pinnelli Ramakrishna Reddy: మాచర్ల మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఎట్టకేలకు బెయిల్ మంజూరైంది. ఏపీ హైకోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. పాస్పోర్టు అప్పగించాలని ఆదేశించింది. బయటి దేశాలకు వెళ్లే ప్రయత్నాలు చేయొద్దని హెచ్చరించింది. ఈవీఎం ధ్వంసం సహా రెండు కేసుల్లో ఆయనకు బెయిల్ లభించింది.
రూ. 50 వేల రూపాయాలతో రెండు పూచీకత్తులు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. పాస్పోర్టు సరెండర్ చేయాలని పేర్కొంది. ప్రతి వారం మెజిస్ట్రేట్, ఎస్హెచ్వో ముందు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. అనుమతులు లేకుండా దేశం విడిచి వెళ్లొద్దని స్పష్టం చేసింది. ఎన్నికల సమయంలో టీడీపీ ఏజెంట్ పై హత్యా ప్రయత్నం చేశారని పిన్నెల్లిపై కేసు నమోదైంది. అలాగే.. పోలీసులపై దాడి ఘటనకు సంబంధించిన కేసు కూడా ఉన్నది. ఈ రెండు కేసుల్లో ఆయన గత రెండు నెలలుగా నెల్లూరు సెంట్రల్ జైలులో ఉంటున్నారు. పిన్నెల్లి సోదరుడు వెంకటరామిరెడ్డి మాత్రం ఇంకా పరారీలోనే ఉన్నాడు.
ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఓ పోలింగ్ బూత్లోకి వెళ్లి హల్ చల్ చేశారు. ఈవీఎం ధ్వంసం చేశారు. టీడీపీ పోలింగ్ ఏంజెట్ను కొట్టాడు. ఆ తర్వాత సీబీఐ అధికారులపైనా దాడి చేశాడు. ఈ ఘటనలకు సంబంధించి ఆయనపై కేసులు నమోదుయ్యాయి. జూన్ 26వ తేదీన పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. దాదాపు రెండు నెలలుగా ఆయన జైలులోనే ఉంటున్నారు.
రెండు సార్లు మాచర్ల నుంచి వైసీపీ టికెట్ పై గెలిచిన పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి మొన్నటి ఎన్నికల్లో కూడా ఇదే అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున పోటీ చేశారు. మాచర్ల నుంచి బరిలోకి దిగిన పిన్నెల్లి పోలింగ్ రోజున బూత్లోకి వెళ్లి గందరగోళం సృష్టించారు. రెంటచింతల మండలం పాల్వాయి గేట్ 202 పోలింగ్ స్టేషన్లోకి వెళ్లిన ఆయన ఈవీఎంను ధ్వంసం చేశారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు రిగ్గింగ్కు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు.
ఈవీఎం ధ్వంసం, టీడీపీ పోలింగ్ ఏజెంట్ నంబూరి శేషగిరి రావుపై, కారంపూడిలో సీఐ నారాయణస్వామిపై దాడి చేశారు. అలాగే, మహిళలను దూషించినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనలకు సంబంధించి పిన్నెల్లిపై కేసులు నమోదయ్యాయి. పోలింగ్ రోజున పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు ఆ రోజు పిన్నెల్లిని గృహ నిర్బంధం చేశారు. మే 14వ తేదీన ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.
Also Read: Jagan: “చంద్రబాబు మాటలు విని షాకయ్యా.. మా హయాంలోనూ ఇలాంటి ప్రమాదమే జరిగింది”
కానీ, ఎన్నికల సంఘం ఈవీఎం ధ్వంసం ఘటనను సీరియస్గా తీసుకుంది. పిన్నెల్లిని అరెస్టు చేసి తీరాలని స్పష్టంగా ఆదేశాలిచ్చింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని రంగంలోకి దిగారు. ఆయనను జూన్ 26వ తేదీన అరెస్టు చేశారు. తనకు బెయిల్ మంజూరు చేయాలని, షరతులు విధించినా సమ్మతమేనని పిన్నెల్లి కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. జిల్లా కోర్టు రెండు సార్లు ఆయన బెయిల్ పిటిషన్లను కొట్టేసింది. తాజాగా హైకోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. పాస్పోర్టును అప్పగించాలని ఆయనకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది.