Table Tennis Player Archana Kamath: పారిస్ ఒలింపిక్స్ టేబుల్ టెన్నీస్ పోటీల్లో భారత్ తరఫున పాల్గొని అద్భుతంగా ఆడిన ప్లేయర్ అర్చన కామత్ సంచలన నిర్ణయం తీసుకుంది. 24 ఏళ్ల అర్చన ఉన్నత చదువుల కోసం అమెరికా వెళుతున్నట్టు తెలిపింది. ఈ అంశం ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. అంతేకాదు భారత క్రీడాకారులు ఈ విషయం తెలిసి ఒక్కసారిగా షాక్ తిన్నారు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే..
ప్రపంచ స్థాయి టేబుల్ టెన్నీస్ క్రీడాకారులతో సమానంగా ఆడేందుకు, విదేశాలకు వెళ్లి శిక్షణ తీసుకునేందుకు తగిన ఆర్థిక స్థితి లేకపోవడం, అన్నింటికి మించి మంచి టేబుల్ టెన్నిస్ ఆర్థికంగా భరోసా ఇవ్వలేకపోవడంతో అర్చన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇలాగే అరకొరగా నేర్చుకుని 2028లో జరిగే ఒలింపిక్స్ కి వెళితే, పతకం వస్తుందనే నమ్మకం, గ్యారెంటీ లేకపోవడంతో తను కఠిన నిర్ణయం తీసుకుందని అంటున్నారు. భారతదేశం తనపై ఎంతో నమ్మకం పెట్టుకుంటే, ఏదో మొక్కుబడిగా పిక్ నిక్ కి వెళ్లినట్టు ఒలింపిక్స్ కి వెళ్లి రిక్తహస్తాలతో తిరిగి రాలేనని భావిస్తూ.. తను నిర్ణయం తీసుకుందని అంటున్నారు.
Also Read: భారత్కు 4 బంగారు పతకాలు.. అండర్-17 ఫైనల్స్లో సత్తా చాటిన రెజ్లర్లు!
పారిస్ ఒలింపిక్స్లో అర్చన కామత్ పోరాటాన్ని క్రీడాభిమానులు ఎవరూ అంత సులువుగా మరిచిపోలేరు. ఒలింపిక్స్లో టేబుల్ టెన్నిస్లో భారత జట్టు తొలిసారి క్వార్టర్ ఫైనల్స్కు చేరడంలో అర్చనది కీలకపాత్ర. క్వార్టర్స్లో జర్మనీ చేతిలో భారత్ ఓడినప్పటికీ అర్చన సత్తాచాటింది.
అర్చనతో పాటు పారిస్ ఒలింపిక్స్ లో మనికా బత్రా, ఆకుల శ్రీజ పాల్గొన్నారు. అయితే అర్చన తన కోచ్ అన్షుల్ గార్గ్తో కలిసి చర్చించి నిర్ణయం తీసుకుంది. ఈ విషయమై గార్గ్ జాతీయ మీడియాతో మాట్లాడాడు. ప్రపంచ టాప్-100 క్రీడాకారులకన్నా తను వెనుకే ఉంది.
వారందరినీ దాటుకు రావడం అంత ఆషామాషీ కాదని అర్చనకు చెప్పాను. బాగా కష్టపడాలని చెప్పాను. అయితే తనిప్పుడు చాలా బాగా ఆడుతోంది. మంచి రిథమ్ లో ఉన్నప్పుడు నిర్ణయం తీసుకుంది. అది మార్చడం కష్టమని తేలిపోయిందని అన్నాడు.
అర్చన తండ్రి గిరీష్ మాట్లాడుతూ.. దేశం కోసం అర్చన అత్యుత్తమ సేవలు అందించింది. చివరికి ఒక కఠినమైన నిర్ణయం తీసుకుంది. మేం మొదటి నుంచి తన అభిప్రాయాన్ని గౌరవిస్తూనే వచ్చాం. ఆడతానంటే సరే అన్నాం. ఇప్పుడు చదువుతాను అంటోంది. సరే అంటున్నామని తెలిపారు.