U-17 World Champions India| ప్రపంచ వేదికపై భారత పతాకం ఉవ్వెత్తున రెపరెపలాడింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు బంగారు పతకాలు ఇండియా ఖాతాలో చేరాయి. జోర్డాన్ లో జరుగుతున్న అండర్ 17 ప్రపంచ చాంపియన్షప్ రెజ్లింగ్ పోటీల్లో గురువారం రాత్రి నలుగురు మహిళా రెజ్లర్లు ఫైనల్స్ లో విజయం సాధించారు. అయితే భారత్ విజయ పరంపర ఇక్కడితో అయిపోలేదు. మరో రెండు బంగారు పతకాలు వచ్చే అవకాశం ఉంది. మొత్తంగా చూస్తే.. మహిళల కుస్తీ పోటీల్లో అండర్ 17 ప్రపంచ చాంపియన్షిప్ అన్ని కేటగిరీల్లో ఇండియానే విజేతగా అవతరించేలా ఉంది.
అండర్ 17 కుస్తీ పోటీల్లో భారత మహిళా రెజ్లర్లు.. అదితి కుమారి 43 కేజీ కేటగిరి, నేహ 57 కేజీ, పుల్కిత్ 65 కేజీ, మాన్సీ లథేర్ 73 కేజీ కేటగిరీ ప్రపంచ చాంపియన్లుగా అవతరించారు.
43 కేజీ కేటగిరీ ఫైనల్స్ లో గ్రీస్ దేశానికి చెందిన మరియా లూయిజా ని భారత రెజ్లర్ అదితి కుమారి 7-0 భారీ స్కోర్ తో చిత్తుగా ఓడించింది. మరో వైపు 57 కేజీ కేటగిరీ ఫైనల్స్ లో భారత రెజ్లర్ నేహా.. జపాన్ కు చెందిన సో సుయిసుయిని డబుల్ లెగ్ అటాక్స్ తో ముప్పుతిప్పలు పెట్టింది. గోల్డ్ మెడల్ సాధించే క్రమంలో నేహా అన్ని రౌండ్లలోనూ ఫుల్ డామినేషన్ తో 10-0 స్కోర్ తో ఇండియా రెజ్లర్ల తడాఖా చాటింది. ఏ దశలోనూ జపాన్ పహిల్వాన్ కోలుకోలేకపోయింది.
ఇక 65 కేజీ కేటగిరీ ఫైనల్స్ లో రష్యాన్ రెజ్లర్ డేరియా ఫ్రోలోవా, భారత రెజ్లర్ పుల్కిత్ మధ్య చివర్లో టఫ్ ఫైట్ జరిగింది. మ్యాచ్ మొత్తం పుల్కిత్ తన ఆటతీరు టెక్నికల్ గా పైచేయి సాధిస్తూ.. ఒక దశలో 5-0 ఉన్నా స్కోర్ ని డేరియా ఒక్క పుష్ అవుట్ తో మూడు పాయింట్లు సాధించింది. ఆ తరువాత చివరి 20 సెకండ్స్ లో పుల్కిత్ మరో పాయింట్ స్కోర్ చేసి మ్యాచ్ ముగించింది. 6-3 లో పుల్కిత్.. దేశం కోసం బంగారు పతకం సాధించింది.
మరోవైపు 73 కేజీల కేటగిరీలో మాన్సీ లథేర్ కూడా రష్యా పహిల్వాన్ హన్నా పిర్స్కాయాపై విజయం సాధించింది. 4 నిమిషాల బౌట్ ని ఇంకా 1.23 నిమిషాలు మిగిలి ఉండగానే మాన్సీ పిన్ ఫాల్ తో ముగించేసింది. మ్యాచ్ ఆరంభం నుంచే అగ్రెసివ్ అటాక్స్ తో రష్యన్ రెజ్లర్ ని ఊపిరి ఆడకుండా చేసింది మాన్సీ. 3-0 స్కోర్ తో పాటు పిన్ ఫాల్ చేసేందుకు హన్నాని ఎత్తిపడేసింది. దీంతో ఇండియా ఖాతాలో మరో గోల్డ్ మెడల్ చేరింది. మాన్సీ లథేర్ జూన్ 2024లో జరిగిన అండర్ 17 ఏషియన్ చాంపియన్ షిప్ 69 కేటగిరీ పోటీల్లో కూడా చాంపియన్ గా నిలవడం విశేషం. జోర్డాన్ లో జరిగే ప్రపంచ చాంపియన్షిప్ పోటీల్లో ఆమె ఇంతకుముందు డిఫెండింగ్ చాంపియన్ అమెరికా రెజ్లర్ పైపర్ ఫ్లావర్ ని 6-0తో ఓడించింది.
మహిళా కుస్తీ పోటీల్లో భారత్ ఖాతాలో నాలుగు గోల్డ్ మెడల్స్ చేరినా.. ఇంకా ఆట పూర్తిగా ముగియలేదు. మరో నలుగురు మహిళా రెజ్లర్ల మ్యాచ్ లు ఇంకా మిగిలి ఉన్నాయి. 69 కేజీ కేటగిరీలో కాజల్, 46 కేజీ కేటగిరీలో శ్రుతిక శివాజీ పాటిల్ 46 కేజీ కేటగిరిలో శుక్రవారం రాత్రి ఫైనల్స్ మ్యాచ్ ఆడనున్నారు. వీరిద్దరు కాకుండా మరో ముగ్గురు రాజ్ బాలా 40 కేజీ కేటగిరీ, ముస్కాన్ 53 కేజీ కేటగిరీ, రాజ్ నీతా 61 కేజీ కేటగిరీ లో కాంస్య పతకం మ్యాచ్ లలో తలపడనున్నారు.
Also Read: యూట్యూబ్తో క్రిస్టియానో రొనాల్డో వరల్డ్ రికార్డ్