Jammu kashmir assembly elections 2024(Telugu news live): జమ్మూకాశ్మీర్లో అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ తెరవెనుక పావులు కదుపుతోంది. రెండురోజుల పర్యటనలో భాగంగా కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్గాంధీ జమ్మూకాశ్మీర్ వెళ్లారు. అక్కడ పార్టీ పరిస్థితుల గురించి ఆరా తీశారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత అక్కడి పరిస్థితులను ప్రజల నుంచి నేరుగా సమాచారం సేకరించారు. ఈ నేపథ్యంలో నేషనల్ కాన్ఫరెన్స్తో పొత్తు పెట్టుకోవాలని నిర్ణయించారు కాంగ్రెస్ అగ్రనేతలు.
శ్రీనగర్లో నేషనల్ కాన్ఫరెన్స్ అగ్రనేతలు ఫారూఖ్ అబ్దుల్లా, మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లాతో కాంగ్రెస్ అగ్రనేతలు ఖర్గే, రాహుల్గాంధీలు దాదాపు గంట పాటు సమావేశమయ్యారు. అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కావడంతో ఎన్నికలకు కలిసి వెళ్లాలని ఇరుపార్టీలు నిర్ణయించాయి.
ఇరుపార్టీల మధ్య చర్చలు ప్రాథమిక స్థాయిలో అంగీకారానికి వచ్చాయి. సీట్ల సర్దుబాటుపై చర్చలు కంటిన్యూ అవుతున్నాయి. జమ్మూకాశ్మీర్లోని మొత్తం 90 అసెంబ్లీ సీట్లకు పొత్తు దాదాపుగా ఖరారైంది. మిత్ర పక్షంతో పొత్తుకు తాము సానుకూలంగా ఉన్నట్లు ఖర్గే ప్రకటించడం జరిగిపోయింది.
ALSO READ: కశ్మీర్ కుర్చీకై పార్టీల కుస్తీలు
పదేళ్ల తర్వాత జరుగుతున్న ఈ ఎన్నికల్లో జమ్ములో 43 స్థానాలు, కాశ్మీర్లో 47 సీట్లు ఉన్నాయి. కాశ్మీర్ లోయలో సగానికి పైగానే పోటీ చేయాలని భావిస్తోంది కాంగ్రెస్ పార్టీ. జమ్మూ ప్రాంతంలో ఎన్సీ ఎక్కువ సీట్లపై కన్నేసింది. కాకపోతే ఎన్సీకి తక్కువ ఇవ్వాలన్నది కాంగ్రెస్ నేతల ఆలోచన.
పొత్తు ఖరారైనట్టు అటు ఎన్సీ కూడా వెల్లడించింది. త్వరలో సీట్ల పంపకాల వివరాలు వెల్లడిస్తామని తెలిపింది. 90 సీట్లలో కూటమి విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తంచేశారు. ఈనెలాఖరుకి సీట్ల పంపకాలు కొలిక్కి రానున్నాయి. సెప్టెంబర్ 18న తొలి విడత, 25న సెకండ్ ఫేజ్, అక్టోబర్ ఒకటిన మూడో విడత ఎన్నికలు జరగనున్నాయి.