– నేను ఏపీ వ్యక్తినంటూ ఫేక్ ప్రచారం
– దళితుడిని కావటంతోనే ఇదంతా
– ఒకటి నుంచి బీటెక్ వరకు ఇక్కడే చదివా
– విద్యార్థి దశ నుంచే ఎన్ఎస్యూఐలో ఉన్నా
– బీఆర్ఎస్ హయాంలో ఎన్నో కేసులు పెట్టారు
– కాంగ్రెస్ నేతల ప్రోత్సాహంతోనే ఈ గౌరవం
– ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు యడవల్లి వెంకట స్వామి
Local Leader: తాను ఆంధ్రా ప్రాంతానికి చెందిన వాడినంటూ బీఆర్ఎస్ ప్రోత్సహిస్తున్న కొన్ని సామాజిక మాధ్యమాలలో జరుగుతున్న దుష్ప్రచారంలో రవ్వంత కూడా నిజం లేదని ఎన్ఎస్యూఐ తెలంగాణ విభాగం అధ్యక్షుడు యడవల్లి వెంకటస్వామి మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఒక దళితుడికి విద్యార్థి సంఘ నేతగా బాధ్యతలు ఇచ్చిన కాంగ్రెస్ చర్యను గులాబీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు. గత 40 ఏళ్లుగా తాను తెలంగాణలో నివసిస్తున్నానని, తన విద్యాభ్యాసమంతా ఇక్కడే జరిగిందని, అన్నీ విచారించిన తర్వాతే ఏఐసీసీ తనను ఎన్ఎస్యూఐ తెలంగాణ విభాగానికి అధ్యక్షుడిగా నియమించిందని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ చలువే..
సామాన్య దళిత కుటుంబానికి చెందిన తాను విద్యార్థి దశ నుంచే ఎన్ఎస్యూఐలో చురుగ్గా పనిచేశానని, తన సేవలను గుర్తించిన కాంగ్రెస్ పార్టీ తనకు ఈ బాధ్యతను అప్పగించిందని గుర్తుచేశారు. తెలంగాణ నుంచి మొత్తం 26 మంది ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్ష పదవికి పోటీపడగా, ఎంపిక కమిటీ 8 మందిని ఇంటర్వ్యూకు ఎంపిక చేయగా, వారిలో తనను ఏఐసీసీ ఎంపిక చేసిందని వివరించారు. ఒక సాధారణ కార్యకర్త నుంచి స్వయంకృషితో రాష్ట్ర అధ్యక్షుడిగా ఎదగడం వెనక పార్టీ నేతల ప్రోత్సాహం ఎంతో ఉందని గుర్తుచేశారు.
40 ఏళ్లుగా ఇక్కడే..
తన చదువంతా తెలంగాణలోనే కొనసాగిందని, ఒకటవ తరగతి నుంచి బీటెక్ వరకు తన విద్యాభ్యాసమంతా తెలంగాణలోనే జరిగిందని, గత 40 ఏళ్లుగా తమ కుటుంబం ఇక్కడే జీవిస్తోందని వెంకటస్వామి వివరించారు. అన్ని ఆధారాలు, సర్టిఫికెట్స్ పరిశీలించాక, ఒక నెలరోజుల పాటు పార్టీ నేతలు చర్చలు జరిగిన తర్వాతే తన నియామకం జరిగిందని వివరించారు. కానీ, ప్రతిపక్ష పార్టీల విద్యార్థి సంఘాలు మాత్రం తాను నాన్ లోకల్ అంటూ దుష్ర్పచారం చేస్తున్నాయని, అందులో రవ్వంత కూడా నిజం లేదని స్పష్టం చేశారు. అనేక సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ తరపున గతంలో తాను పలు అంశాలపై పోరాటాలు చేశానని ఈ ఆరోపణలు చేసే వారికీ తెలుసని పేర్కొన్నారు.
Also Read: Yadadri Temple: హరీశ్ రావు పాప ప్రక్షాళన పూజ వివాదాస్పదం
జీర్ణించుకోలేకనే..
బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేళ్లలో తనపై అనేక కేసులు పెట్టారని, ఒక దళితుడికి రాష్ట్ర స్థాయి బాధ్యతలు ఇవ్వటాన్ని జీర్ణించుకోలేకనే గులాబీ పార్టీ ప్రోత్సహించే కొందరు వ్యక్తులు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. తనకు గుర్తించిన ఏఐసీసీ అగ్ర నేతలు, సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్కు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.