Harish Rao: రుణమాఫీ పేరు చెప్పి రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం దగా చేసిందని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శలు గుప్పించారు. దేవుళ్లపై ఒట్టేసి మరీ సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు ఈ హామీ ఇచ్చారని చెప్పారు. దేవుళ్లపై ఒట్టేసి ఇచ్చిన మాట ఆయన నిలబెట్టుకోలేదని వివరించారు. ఇది ఆయనకే కాదు.. రాష్ట్రానికి కూడా అరిష్టం అని చెప్పారు. ఆ అరిష్టం తగలకుండానే తాను ఆ దేవుళ్ల ఆలయాలకు వెళ్లి పాప ప్రక్షాళన పూజ చేస్తామని వివరించారు. ఈ రోజు ఉదయం మాజీ మంత్రి హరీశ్ రావు యాదాద్రి ఆలయానికి వెళ్లి పాప ప్రక్షాళన పూజ చేశారు.
అనంతరం, ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సీఎం రేవంత్ రెడ్డి దేవుళ్లపై ఒట్టేసి ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదని, కాబట్టి, ఆయనకు ఏమీ జరగకూడదని తాము పూజలు చేస్తున్నామని వివరించారు. ఇలా దేవుడిపై ఒట్టేసి మాట తప్పితే ఆ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు అరిష్టమని తనకు కొందరు బ్రాహ్మణులు చెప్పారని, అందుకే ఈ పాప ప్రక్షాళన పూజ చేస్తున్నామని తెలిపారు.
అయితే, హరీశ్ రావు చేసిన ఈ పాప ప్రక్షాళన పూజ వివాదాస్పదమైంది.త మాడవీధుల్లో పాప ప్రక్షాళన పూజలు చేయరాదని, ఇది ఎండోమెంట్ సెక్షన్ 7 కింద నేరమని ఆలయ అధికారులు తెలిపారు. యాదగిరి కొండలు పవిత్రమైనవని, ఇక్కడ ఎలాంటి రాజకీయ, ఇతర మత కార్యక్రమాలు చేపట్టరాదని చెప్పారు. ఇందుకు సంబంధించిన నిబంధనలు ఉన్నాయని ఆలయ ఈవో తెలిపారు. అందుకే ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. మాజీ మంత్రి హరీశ్ రావు, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతలు ఇక్కడ పూజలు నిర్వహించినట్టు, వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Also Read: Congress Govt: పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ సంగతేంటి?: కేటీఆర్
ఇదిలా ఉండగా.. హరీశ్ రావు పాప ప్రక్షాళన పూజలకు కౌంటర్గా కాంగ్రెస్ నాయకులు ఆలయ శుద్ధి కార్యక్రమం చేపట్టారు. మాడవీధులను శుభ్రం చేసి బీఆర్ఎస్ పార్టీకి కౌంటర్ ఇచ్చారు.