KTR: మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గ్రామ పంచాయతీ ఎన్నికల గురించి మాట్లాడారు. లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం భయపడుతున్నదని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకుంటే కేంద్రం నుంచి గ్రాంట్లు రావని, సర్పంచ్ పదవీ కాలం ముగిసి నెలలు గడుస్తున్నాయని వివరించారు. ఇది ముందు నుయ్యి.. వెనుక గొయ్యిలా మారినట్టుగా ప్రభుత్వ తీరు ఉన్నదని విమర్శించారు. బీసీ రిజర్వేషన్ పై ప్రభుత్వానికి స్పష్టత లేదన్నారు. బీసీ రిజర్వేషన్ ఎలా నిర్దారిస్తారని ప్రశ్నించారు. తెలంగాణకు రాజీవ్ గాంధీ చేసిందేమీ లేదని తెలిపారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎయిర్పోర్టు పేరు మారుస్తామని, రాజీవ్ గాంధీ పేరు తొలగిస్తామని స్పష్టం చేశారు.
రైతులందరికీ రుణమాఫీ జరగలేదని బీఆర్ఎస్ పార్టీ నేతృత్వంలో మండల కేంద్రాల్లో ధర్నాలు జరుగుతున్నాయి. ఇది మొదటి స్టెప్ మాత్రమేనని, రెండో స్టెప్లో ప్రతి గ్రామానికి తాము వెళ్లుతామని కేటీఆర్ హెచ్చరించారు. రిలే దీక్షలు కూడా చేపడుతామని వివరించారు. కాంగ్రెస్ పార్టీ ఎక్కడైతే హామీలు ఇచ్చిందో.. అక్కడే అమలును డిమాండ్ చేస్తూ దీక్షలు చేస్తామని తెలిపారు. అందరికీ రుణమాఫీ అయ్యే వరకు వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని, రూ. 7,500 కోట్లు మాత్రమే రైతు రుణమాఫీ జరిగిందని తెలిపారు. రూ. 31 వేల కోట్ల రుణమాఫీ అయ్యే వరకు వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. రైతుల నిరసన ఎదుర్కోవాల్సి వస్తుందనే రాష్ట్ర మంత్రులు ప్రభుత్వ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని కేటీఆర్ ఆరోపించారు.
Also Read: Sebi Scandal: బీజేపీకి బీఆర్ఎస్ అనుకూలం.. ఇదే నిదర్శనం: సీఎం రేవంత్ రెడ్డి
ఇక ఆయన కుటుంబం గురించి మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రతిసారి బయటికి రావాల్సిన అవసరం లేదన్నారు. కేసీఆర్ తమకు ట్రంప్ కార్డు అని.. ఆయన ఎఫ్పుడు బయటకు రావాలో అప్పుడే వస్తారని స్పష్టం చేశారు. ఇక సోదరి, ఎమ్మెల్సీ కవిత ఆరోగ్య పరిస్థితి గురించి బావను అడిగి తెలుసుకున్నట్టు వివరించారు. ఢిల్లీ లిక్కర్ కేసులో తిహార జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న కవిత మళ్లీ అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే.
ఇక.. అదానీ మీద హెండెన్ బర్గ్ రిపోర్టుపై కచ్చితంగా సుప్రీంకోర్టు విచారించాల్సిందేనని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. తెలంగాణ తల్లి విక్రమం తమ సొంత డిమాండ్ కాదని, తెలంగాణ ప్రజలందరి డిమాండ్ అని తెలిపారు. రాజ్యసభ పదవిని హనుమంత్ రావుకు ఇస్తే బాగుండేదని వివరించారు.కిషన్ రెడ్డికి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే దమ్మే లేదని విమర్శించారు.