Atchutapuram SEZ accident news(AP news live): అచ్యుతాపురంలోని ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలిన ఘటనలో మృతి చెందినవారి కుటుంబాలకు విశాఖ జిల్లా కలెక్టర్ ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. మృతుల కుటుంబాలకు కోటి రూపాయలు ఎక్స్ గ్రేషియా ప్రకటించిన కలెక్టర్ హరిందర్ ప్రసాద్.. క్షతగాత్రులకు కూడా పరిహారం ప్రకటిస్తామని తెలిపారు. క్షతగాత్రులకు అయిన గాయాల తీవ్రతను బట్టి ఎక్స్ గ్రేషియా ఉంటుందన్నారు. ప్రస్తుతం కొందరు చికిత్స పొందుతున్నా.. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. అయితే ప్రస్తుతానికి మృతుల సంఖ్య పెరిగే అవకాశం లేదన్నారు. వారికి ఎంత పరిహారం చెల్లిస్తామన్నది త్వరలోనే చెబుతామని పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం కూడా మృతులు, క్షతగాత్రులకు ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. మృతి చెందిన వారి ఒక్కొక్క కుటుంబానికి రూ. 2 లక్షలు, గాయపడి వారిని రూ.50 వేలు నష్టపరిహారం అందిస్తామని పీఎంఓ X వేదికగా వెల్లడించింది. సాల్వెంట్ లీక్ అవ్వడమే ప్రమాదానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది.
Also Read: అచ్యుతాపురం ప్రమాదస్థలానికి సీఎం చంద్రబాబు.. ఫార్మా క్షతగాత్రులకు పరామర్శ
ఇదిలా ఉండగా.. ప్రమాదం జరిగి 20 గంటలైనా.. కంపెనీ యాజమాన్యం ఇంతవరకూ దీనిపై స్పందించలేదు. సీఎం చంద్రబాబు నాయుడు ప్రమాదంపై ఉన్నతస్థాయి విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. నేడు సీఎం అచ్యుతాపురంల పర్యటించనున్నారు. మృతుల కుటుంబాలను, క్షతగాత్రులను పరామర్శించి.. ప్రమాద స్థలాన్ని పరిశీలించనున్నారు.
ఇప్పటివరకూ ప్రమాదంలో మృతి చెందిన వారి సంఖ్య 18కి చేరింది. పోస్టుమార్టం నిమిత్తం 12 మృతదేహాలను కేజీహెచ్ కి, 5 మృతదేహాలను అనకాపల్లికి తరలించారు. మరో 41 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మృతి చెందిన వారి కుటుంబాల ఆందోళనతో కేజీహెచ్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తమవారిని చూడనివ్వడం లేదని బంధువులు ఆరోపిస్తున్నారు. తమకు సరైన సమాచారం ఇవ్వడం లేదని, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు.