Chandrababu Naidu to Visit Atchutapuram SEZ(AP news today telugu): అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ప్రమాద ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు సీఎం చంద్రబాబు. అధికారులతో సీఎం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రమాదంపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు. రియాక్టర్ పేలిన ఘటనలో ఇప్పటివరకు 18 మంది మృతి చెందారు. ఇంకా అనేకమంది కార్మికులకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులకు అందుతున్న వైద్యంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అన్ని విభాగాల వైద్యులు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. వీలైనంత మంది బాధితుల ప్రాణాలు కాపాడాలని సీఎం చంద్రబాబు సూచించారు. ప్రమాదానికి కారణాలు ఏంటనే విషయంలో ప్రాధమిక సమాచారాన్ని అధికారులు సీఎంకు వివరించారు.
ఇవాళ అచ్యుతాపురంలో పర్యటించనున్నారు సీఎం చంద్రబాబు. ఫార్మా కంపెనీ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలను, ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న వారిని పరామర్శించనున్నారు. అనంతరం ఘటన జరిగిన ప్రాంతాన్ని పరిశీలిస్తారు. ప్లాంట్ నిర్వహణలో మానవ తప్పిదం, ప్లాంట్ నిర్మాణంలో లోపాలపై ప్రాథమిక సమాచారాన్ని సీఎంకు వివరించారు అధికారులు. ప్రమాదానికి గల కారణాలపై ఉన్నత స్థాయి దర్యాప్తు జరిపి నివేదిక ఇవ్వాలని సీఎంచంద్రబాబు ఆదేశించారు. ఇంత మంది ప్రాణాలు కోల్పోవడం తనను తీవ్రంగా కలిచివేసిందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్క బాధితుడిని ఆదుకునే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుదన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు.
Also Read: అచ్యుతాపురం మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించిన కేంద్రం
రియాక్టర్ పేలి పలువురు కార్మికులు ప్రాణాలు కోల్పోవడం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని మంత్రి నారా లోకేశ్ అన్నారు. దుర్ఘటనలో తీవ్రంగా గాయపడి, వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారి ప్రాణాలు కాపాడేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని సీఎం ఇప్పటికే యంత్రాంగాన్ని ఆదేశించారని తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.