Central government declared ex gratia who died in pharma company reactor blast at Anakapalli: ఏపీలోని అనకాపల్లి ఫార్మా కంపెనీలో బుధవారం జరిగిన రియాక్టర్ పేలుడు ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటిదాకా 18 మంది మృతి చెందగా దాదాపు 50 మందికి పైగా గాయలయ్యాయి. కాగా ఈ ఘటనతో ఉన్నత స్థాయి విచారణ జరపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. అయితే గురువారం అనకాపల్లి దుర్ఘటన ప్రాంతాన్ని సీఎం చంద్రబాబు సందర్శించనున్నారు. ఉదయం విజయవాడ గన్నవరం విమానాశ్రయం చేరుకుని అక్కడ నుంచి అనకాపల్లికి చేరుకుని తర్వాత కారు మార్గం ద్వారా అనకాపల్లి చేరుకుంటారు. అక్కడ మృతుల కుటుంబాలను పరామర్శిస్తారు. తర్వాత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కార్మికులను కలుసుకుంటారు.
ప్రమాద పరిహారం
రియాక్టర్ ప్రమాద దుర్ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు పరిహారం ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. మృతి చెందిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ.2 లక్షల రూపాయల పరిహారం..అలాగే ప్రమాదంలో గాయపడిన వారికి యాభై వేల రూపాయలు పరిహారం చెల్లిస్తామని ప్రధాన మంత్రి కార్యాలయ సిబ్బంది ఓ ప్రకటనలో తెలిపింది. ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ఈ సంఘటనపై దిగ్భ్రాంతిని తెలియజేశారు. గాయపడిన క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని తెలియజేశారు. ప్రమాదానికి ముఖ్యంగా సాల్వెంట్ లీక్ కావడం వల్లే జరిగిందని అంటున్నారు. రియాక్టర్ లో తయారయిన ప్రమాదకరమైన రసాయనాలు స్టోరేజ్ ట్యాంకులోకి మార్చే సమయంలోనే ఈ భారీ విస్ఫోటనం జరిగిందని ప్రాధమిక విచారణలో తేలింది. ఈ ఘటనలో పేలుడు దెబ్బకు ఫ్యాక్టరీ భవనం గోడలు కూలి పనిచేసే కార్మికులపై పడటంతో తీవ్రగాయాలయ్యాయి.