Ration Shops get Makeover as Government Pilots: దేశంలోని నిరుపేదలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే రేషన్ షాపులను జన్ పోషన్ కేంద్రాలుగా తీర్చిదిద్దనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు రేషన్ షాపుల్లో బియ్యంతోపాటు ఉప్పు, పప్పులు, చిరు ధాన్యాలు, పాల ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపింది.
ఈ మేరకు దారిద్య్రరేఖకు దిగువన ఉన్న పేదలకు నాణ్యమైన పోషకాలు అందించాలనే లక్ష్యంతోపాటు రేషన్ షాప్ డీలర్ల ఆదాయాన్ని పెంచడమే ధ్యేయంగా పైలెట్ ప్రాజెక్ట్ ప్రారంభించనున్నట్లు కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు.
ఇందులో భాగంగా దేశంలోని 4 రాష్ట్రాలను ఎంపిక చేయనుంది. మొదటగా గుజరాత్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో 60 రేషన్ షాపులను ‘జన్ పోషన్’ కేంద్రాలుగా తీర్చిదిద్దనున్నట్లు మంత్రి తెలిపారు.
ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో రేషన్ షాపులు నెలకు కేవలం వారం రోజులు మాత్రమే తెరుస్తున్నారని, మరికొన్ని ప్రాంతాల్లో 3 నెలలకోసారి మాత్రమే పనిచేస్తున్నాయని మొత్రి పేర్కొన్నారు. ఇలా మిగిలిన రోజుల్లో రేషన్ షాపులు మూసివేసి ఉంటున్నాయన్నారు. దీంతో రేషన్ డీలర్లకు సైతం కమీషన్లు సరిపోవట్లేదని, అందుకే ప్రత్యామ్నాయ విధానాలు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ మేరకు మేరా రేషన్ యాప్ అప్ గ్రేడ్ వెర్షన్ ను కేంద్ర మంత్రి పరిచయం చేశారు.
ఇదిలా ఉండగా, ఎంపిక చేసిన రేషన్ షాపుల్లో తృణ(చిరు)ధాన్యాలు, పప్పులు, పాల ఉత్పత్తులు, రోజువారీ నిత్యావసర సరుకులు సహా మొత్తం 3,500 ఉత్పత్తులను తక్కువ ధరకే రేషన్ కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం విక్రయించనుంది.
Also Read: అప్పటికల్లా అంతరిక్ష కేంద్రానికి భారత వ్యోమగామి: కేంద్రమంత్రి జితేంద్ర సింగ్
దీంతో ప్రజలకు పోషకాలు ఉన్న ఆహార పదార్థాలను అందించడమే కాకుండా, ఎక్కువ ఉత్పత్తులను విక్రయించినందుకు రేషన్ డీలర్లకు వచ్చే కమీషన్ కూడా పెరుగుతుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.