– దక్షిణ భాగం భూసేకరణపై కీలక సూచనలు
– పనులను నేరుగా పర్యవేక్షించాలని ఆదేశం
– సౌత్ అలైన్మెంట్లో మార్పులపై చర్చ
– రైతులకు ఇబ్బంది లేకుండా భూసేకరణ చేయాలి: సీఎం
Regional Ring Road: భాగ్యనగరానికి మణిహారంగా రూపొందనున్న రీజినల్ రింగ్ రోడ్ పని విషయంలో అధికారులంతా మరింత వేగంగా నిర్ణయాలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. బుధవారం రీజినల్ రింగ్ రోడ్ ప్రగతిపై సచివాలయంలో అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. భూసేకరణ పనులు మొదలు పలు పెండింగ్ అంశాలపై దృష్టి సారించి వీలున్నంత త్వరగా రీజినల్ రింగ్ రోడ్ పని పూర్తి చేయగలిగితే.. రాష్ట్ర అభివృద్ధి వేగంగా పుంజుకుంటుందని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు.
సౌత్.. భూసేకరణపై ఫోకస్..
రోడ్డు ఉత్తర భాగంలో భూ సేకరణ పనులు చాలావరకు పూర్తయిందని, ఇక.. దక్షిణ భాగంలో భూసేకరణ మీద కసరత్తు చేస్తు్న్నట్లుగా అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఆ సమయంలో సీఎం జోక్యం చేసుకుంటూ.. భూసేకరణపై అధికారులకు పలు సూచనలిచ్చారు.రీజినల్ రింగు రోడ్డు ప్రగతిలో జిల్లా కలెక్టర్లను మరింతగా భాగస్వాములను చేయాలని, జిల్లాలలో భూసేకరణ, ఇతర అంశాల మీద వారితో రోజువారీగా సమీక్ష చేసుకుంటూ సమన్వయం చేసుకోవాలని సూచించారు. పనుల పురోగతి మీద తాజా అప్డేట్లను తనకు అందించాలని సూచించారు.
డైలీ అప్డేట్ ఇవ్వండి…
రీజినల్ రింగ్ రోడ్ను వీలున్నంత త్వరగా పూర్తి చేయాలని, అందుకోసం ఉన్నతాధికారులు ఇక దూకుడుగా పనిచేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. గత అనుభవాల దృష్ట్యా భూసేకరణకు రైతులు ముందుకు రాని ప్రదేశాల్లో కలెక్టర్లు చొరవ తీసుకుని నేరుగా రైతులతో మాట్లాడాలని ముఖ్యమంత్రి సూచించారు. భూసేకరణ పనులు ఎంత వరకు వచ్చిందనే అప్డేట్ను రోజువారీగా కలెక్టర్లు.. ప్రధాన కార్యదర్శికి అందించాలన్నారు. నష్టపరిహారం విషయంలో మానవీయ కోణంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా నష్టపరిహారం అందించే విషయంలో పారదర్శతను పాటించాలని ఆదేశించారు. సీఎస్, మౌలిక వసతులు, ప్రాజెక్టుల సలహాదారు శ్రీనివాసరాజు, సీఎం ఓఎస్డీ షానవాజ్ ఖాసీం, జిల్లాల కలెక్టర్లు, ఆర్ అండ్ బీ అధికారులతో వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి పనుల పురోగతిని అందులో అప్డేట్ చేయాలన్నారు. ఒక సమీక్ష సమావేశానికి మరో సమీక్ష సమావేశానికి మధ్య కాలంలో పనుల్లో పురోగతి కనిపించాలని పేర్కొన్నారు.
Also Read: Allu Arjun: నా ఫ్రెండ్స్ కోసం నేను వస్తా.. రాజకీయ పర్యటనపై అల్లు అర్జున్ క్లారిటీ
అలైన్మెంట్ మార్పులపై సూచన
ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగం సంగారెడ్డి-ఆమన్గల్-షాద్ నగర్-చౌటుప్పల్ (189.20 కి.మీ.) మార్గానికి సంబంధించి భూ సేకరణ ప్రారంభించాలని, ఈ రోడ్డు విషయంలో ఉన్న టెక్నికల్ సమస్యలను కేంద్ర అధికారులతో మాట్లాడి పరిష్కరించాలని సూచించారు. ఆర్ఆర్ఆర్ మొత్తం మ్యాప్ను గూగుల్ మ్యాప్లో సీఎం పరిశీలించారు. భవిష్యత్ అవసరాల దృష్ట్యా దక్షిణ భాగపు అలైన్మెంట్లో కొన్ని మార్పులు సూచించిన సీఎం, ఈ విషయంలో పారదర్శకంగా నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. తాను సూచించిన మార్పులపై క్షేత్ర స్థాయి పర్యటన చేసి సమగ్ర నివేదికను అందించాలని అధికారులను ఆదేశించారు.