మాటలు జాగ్రత్త!
– మాది ప్రజా ప్రభుత్వం
– మొదటి ఏడాదిలోనే రుణమాఫీ చేశాం
– మీలాగా ఐదేళ్లు వాయిదాలతో చేయలేదు
— బీఆర్ఎస్ వ్యాఖ్యలపై భట్టి ఫైర్
Farm Loan Waiver: రుణమాఫీ గురించి అవగాహన లేనివారు అవాకులు చవాకులు పేలుతున్నారని మండిపడ్డారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని జమలాపురంలో పర్యటించారు. ఐదు సంవత్సరాల్లో లక్ష రుణమాఫీ చేయలేని వాళ్లు, మొదటి సంవత్సరంలోనే 2 లక్షల రుణమాఫీ చేసిన వారి గురించి సిగ్గు ఎగ్గు లేకుండా మాట్లాడుతున్నారని, ఆ భాష మాట్లాడడానికి బాధగా ఉందన్నారు. 2 లక్షల పైన బ్యాంకు రుణం తీసుకున్న రైతులు, పై మొత్తాన్ని చెల్లించి వ్యవసాయ శాఖకు సమాచారం ఇస్తే వెంటనే 2 లక్షల రుణమాఫీ అవుతుందని స్పష్టం చేశారు. రుణమాఫీకి సంబంధించి ఈ దేశంలో ఎవరు ఊహించని విధంగా, ఏ రాష్ట్రంలో జరగని విధంగా ఒకేసారి చేశామన్న ఆయన, అది కూడా అధికారం చేపట్టిన మొదటి సంవత్సరంలోనే పూర్తి చేశామని తెలిపారు. ‘‘జూలై 17న రుణమాఫీ జీవో ఇచ్చి వెంటనే 18వ తేదీన మొదటి విడుత లక్ష వరకు రుణం ఉన్నవారి ఖాతాలో డబ్బులు జమ చేశాం. రెండో విడుత 15 రోజుల వ్యవధిలోనే ఆలస్యం జరగకుండా జూలై 30న అసెంబ్లీలో లక్షన్నర వరకు బ్యాంకు రుణం ఉన్నవారికి వారి ఖాతాల్లో నగదు జమ చేశాం.
మూడో విడుత ఆగస్టు 15న వైరా బహిరంగ సభలో 2 లక్షల వరకు బ్యాంకు రుణం ఉన్న రైతుల ఖాతాలోకి నగదు జమ చేశాం. గత పాలకులు 2014 నుంచి 2018 వరకు లక్ష రుణం ఐదు సంవత్సరాల పాలనా కాలంలో నాలుగు వాయిదాలలో చెల్లించారు. వారు వాయిదాలలో చెల్లించడంతో అది వడ్డీలకే సరిపోయింది. బ్యాంకర్లు రైతులకు కొత్తగా రుణాలు ఇవ్వలేకపోయారు. రెండో దఫా అధికారంలోకి వచ్చినప్పుడు ఎన్నికల ముందు అరకొరగా రైతులకు రుణమాఫీ చేశారు. మాది ప్రజా ప్రభుత్వం. మీలాగా మేము దోపిడీలు చేయలేదు. రాష్ట్ర సంపద ప్రతి పైసా పేదవారికి చేరుస్తాం. గత పది సంవత్సరాలు పంటల బీమా కూడా చేయని దుర్మార్గులు మీరు. గత పది సంవత్సరాల్లో పంట నష్టపోతే ఒక్క రూపాయి కూడా రైతులకు రాలేదు. మేము అధికారంలోకి రాగానే పంటల బీమా కోసం రైతులు కట్టాల్సిన డబ్బులను బీమా కంపెనీలకు చెల్లించాం. పంటల బీమానే కాదు రైతు బీమా డబ్బులు కూడా రైతుల పక్షాన ప్రభుత్వం ఇప్పటికే చెల్లించింది. ఏ రైతు బీమా పేరిట ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు. ఇది మా ప్రభుత్వ నిబద్ధత. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వ్యవసాయ అనుబంధ రంగాలకు 72 వేల కోట్లు బడ్జెట్లో కేటాయించాం’’ అని వివరించారు డిప్యూటీ సీఎం.