MLA Vivek: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్కు చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. జన్వాడ ఫామ్ హౌజ్ అంశం రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపుతున్నది. నిబంధనలు ఉల్లంఘించి ఆ ఫామ్ హౌజ్ నిర్మించారని, అది కేటీఆర్దేనని ప్రధానంగా ఆరోపణలు వస్తున్నాయి. కాగా, అది తనది కాదని, కాంగ్రెస్ ఎమ్మెల్యేలవే చాలా ఫామ్ హౌజ్లు నిబంధనలు ఉల్లంఘించి నిర్మించబడ్డాయని ఆరోపించారు. కేటీఆర్ వ్యాఖ్యలను పలువురు నాయకులు ఖండించారు. ఇదే క్రమంలో చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ కూడా ఘాటుగా రియాక్ట్ అయ్యారు.
జీవో నెంబర్ 111ను తాను ఉల్లంఘించినట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే వివేక్ మండిపడ్డారు. తన తాను ఎల్లప్పుడూ నిబంధనలకు లోబడే నడుచుకున్నానని, తన ఫామ్ హౌజ్ను రూల్స్ ప్రకారమే నిర్మించామని స్పష్టం చేశారు. తాను ఎలాంటి నిబంధనలను ఉల్లంఘించలేదని, బీఆర్ఎస్ నాయకులు అసత్య ఆరోపణలు ప్రచారం చేస్తే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు. కేటీఆర్ ప్రోత్సాహంతోనే తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహించారు.
హైడ్రా చట్టం ప్రకారం ఫామ్ హౌజ్ లేదని, చర్యలు తీసుకోవాలని తనపై దుష్ప్రచారం జరుగుతున్నదని ఎమ్మెల్యే వివేక్ పేర్కొన్నారు. ఈ ప్రచారాన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నాని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన కేటీఆర్కు సవాల్ చేశారు. దమ్ముంటే ఆయన చేసిన ఆరోపణలు నిరూపించాలని, తన ఫామ్ హౌజ్ నిబంధనలు ఉల్లంఘించినట్టు నిరూపించాలన్నారు. లేదంటే.. కేటీఆర్ పై డిఫమేషన్ వేస్తానని వార్నింగ్ ఇచ్చారు.
Also Read: Janwada Farm House: జన్వాడ ఫామ్హౌజ్ కూల్చివేతపై హైకోర్టు తీర్పు ఇదే
ఇప్పటి వరకు తనపై చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని ఎమ్మెల్యే వివేక్ స్పష్టం చేశారు. ఒక వేళ తాను తప్పు చేసి ఉంటే కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు యాక్షన్ తీసుకోలేదని ప్రశ్నించారు. అధికారం పోవడంతో కేటీఆర్ ఫ్రస్ట్రేషన్లోకి పోతున్నాడని, అందుకే తప్పుడు వార్తలు సృష్టిస్తున్నారని పేర్కొన్నారు. క్యాంప్ ఆఫీసులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే వివేక్ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.