Bihar Gun Fire RJD Leader Pankaj Roy Murdered: బీహార్లో దారుణం చోటుచేసుకుంది. ఆర్జేడీ నేత, కౌన్సిలర్ పంకజ్ రాజ్ హత్యకు గురయ్యారు. హాజీపూర్లో తన నివాసం ఎదుట కూర్చొని ఉండగా..కొంతమంది దుండగులు ఒక్కసారిగా కాల్పులు జరిపారు. వెంటనే పంకజ్ రాజ్ పారిపోయేందుకు ప్రయత్నించగా..దుండగులు వెనక్కి తగ్గకుండా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో పంకజ్ రాజ్ అక్కడికక్కడే మృతి చెందాడు.
వివరాల ప్రకారం.. బీహార్లోని హాజీపూర్లోని తన నివాసానికి సమీపంలోని బట్టల దుకాణంలో ఉండగా..ముగ్గురు దుండుగులు బైక్ పై వచ్చారు. అనంతరం అతని దగ్గరకు వచ్చి ఒక్కసారిగా కాల్పులు జరిపారు. దీంతో అతడు ప్రాణాలకు కాపాడుకునేందుకు ఇంట్లోకి పరిగెత్తగా..దుండగులు లోపలికి వచ్చి మళ్లీ కాల్పులు జరిపి పారిపోయారు.
సమాచారం తెలుసుకున్న కుటుంబసభ్యులు, స్థానికులు వెంటనే ఇంట్లోకి పరిగెత్తి చూడగా..రక్తపు మడుగులో కనిపించాడు. దీంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించి అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. దీంతో హాజీపూర్ లో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఈ ఘటనపై ఆర్జేడీ నేత, మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ స్పందించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో ఎన్డీఏ కూటమి, బీహార్ సీఎం నితీశ్ కుమార్ విఫలమయ్యారని మండిపడ్డారు. దుండగులు అర్ధరాత్రి దాడులు చేస్తున్నారని, రాష్ట్రంలో దారుణాలు జరుగుతుండగా సీఎం, డిప్యూటీ సీఎం ప్రశాంతంగా నిద్రపోయారా? అని విమర్శలు చేశారు.
Also Read: బెంగళూరులో మరో యువతి పై దారుణం.. లిఫ్ట్ పేరుతో బైక్ ఎక్కించుకుని..
6 నెలల క్రితమే ప్రాణహాని ఉందని పోలీసులకు పంకజ్ రాయ్ విన్నవించారని, అయినా చర్యలు తీసుకోలేదని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపించారు. అయితే ఈ ఘటనపై విచారణ చేస్తున్నామని, ఘటనా స్థలంలో సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.