Varadarajulu Reddy Fires on Ex MLA Rachamallu Siva Prasad Reddy: ఎన్నికల ముందు ఆ నాయకుడు చాలా కబుర్లే చెప్పారు. గెలిచినా ఓడినా మీతోనే ఉంటానని ప్రజలకు తెగ హామీలిచ్చారు. సొంత డబ్బులు ఖర్చుపెట్టి అభివృద్ది అంటే ఎలా ఉంటుందో చూపిస్తానని ప్రగల్భాలు పలికారు. అబ్బో నిజమేనని నమ్మి కౌన్సిలర్గా ఉన్న ఆయన్ని ఏకంగా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారు అక్కడి జనం.. ఆ ఊపులో గత ఎన్నికల్లో తన హామీల పర్వాన్ని మరింత ఉదృతం చేసి ప్రచారం చేసుకున్నారాయన.. తీరా చూస్తే మూడో సారి ఆయన సినిమా కాలిపోయింది. ఆ క్రమంలో ఆయన అవినీతి భాగోతాలు ఒకొక్కటి బయటపుడున్నాయి. దాంతో ఆయన అందరికీ ముఖం చాటేస్తున్నారు. ఇంతకీ ఎవరా నేత అంటారా? మీరే చూడండి.
సార్వత్రిక ఎన్నికల సమయంలో కడప జిల్లా పొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి చాలా ప్రగల్బాలే పలికారు. వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి పొద్దుటూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని హామీలు గుప్పించారు. ప్రొద్దుటూరు కౌన్సిలర్గా తన పొలిటికల్ కెరీర్ ప్రారంభించిన రాచమల్లు కాంగ్రెస్ హయాంలో ఇన్చార్జ్ మున్సిపల్ చైర్మన్గా కూడా పనిచేశారు. తర్వాత వైసీపీలో చేరి ఎమ్మెల్యేగా ప్రమోషన్ దక్కించుకున్నారు. వైసీపీ హయాంలో ఇష్టానుసారంగా వ్యవహరించిన ఆయన ఇప్పుడు వివాదాలు ఉచ్చులో చిక్కుకుని జనానికి కనిపించడమే మానేశారు.
2014, 2019 ఎన్నికలలో వైసీపీ నుంచి భారీ మెజారిటీలతో గెలుపొందిన శివప్రసాద్ రెడ్డి రెండో సారి గెలిచినప్పుడు అధికారాన్ని అడ్డుపెట్టుకొని క్రికెట్ బెట్టింగులు, మట్టి, ఇసుక , మద్యం మాఫియాలతో పాటు పేకాట క్లబ్బులు నిర్వహించి గట్టిగానే వెనకేసుకున్నారన్న ఆరోపణలున్నాయి. తన బామ్మర్ది బంగారురెడ్డిని ముందుపెట్టి ఆయన ఆ దందాలన్నీ నిర్వహించారంట. ఇప్పుడు పవర్ పోయాక రాచమల్లు అవినీతి భాగోతాలపై నియోజకవర్గంలో పెద్ద చర్చే జరుగుతోంది.
ఎన్నికల ప్రచారంలో లక్ష ఓట్ల మెజార్టీతో మూడో సారి గెలుస్తానని రాచమల్లు ధీమా వ్యక్తం చేశారు. అయితే 2019 ఎన్నికల్లో 43 వేల ఓట్లకు పైగా మెజార్టీతో గెలిచిన రాచమల్లు మొన్నటి ఎన్నికల్లో కూటమి అభ్యర్ధి వరదరాజులరెడ్డి చేతిలో 20 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రాచమల్లు చేసిన అరాచకాలు, పాల్పడిన అవినీతే అంత ఘోర పరాజయానికి కారణమంటున్నారు. వరదరాజులరెడ్డి ఎమ్మెల్యేగా పదవి బాధ్యతలు చేపట్టినప్పుడు నుండి తనదైన ముద్ర వేసుకుంటూ ప్రజల్లో మమేకమై తిరుగుతున్నారు. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమాల్ని ఎండగడుతూ, రాచమల్లు ఫ్యామిలీ అరాచకాలపై కూపీలు లాగుతూ.. వాటిపై తక్షణం చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
Also Read: జగన్ గారూ.. మహిళల కోసం మీరు మాట్లాడుతుంటే విడ్డూరంగా ఉంది: అనిత
గెలిచినా ఓడినా ప్రజల పక్షాన నిలబడి పోరాటాలు చేస్తానని చెప్పిన రాచమల్లు శివప్రసాదరెడ్డి ఇప్పుడు నియోజకవర్గంలో కనిపించడమే మారేశారు. మా మాజీ ఎమ్మెల్యే ఏమైపోయారని? నెటిజన్లు సోషల్ మీడియాలో తెగ హడావుడి చేస్తున్నా ఆయన ఆచూకీ ఎవరికీ తెలియడం లేదు. అధికారంలో ఉన్నప్పుడు నియంతలా వ్యవహరించిన మాజీ ఎమ్మెల్యే మాఫీయా వ్యవహారాలపై కేసులు నమోదవుతున్నాయి. ఆ భయంతోనే ఆయన అడ్రస్ లేకుండా పోయారంటున్నారు.
ఉమ్మడి కడప జిల్లా వ్యాప్తంగా వైసీపీ 2024 సార్వత్రిక ఎన్నికలలో ఘోర పరాజయం పాలయ్యింది. జగన్ సొంత జిల్లాలో పది నియోజకవర్గాలకు గాను జగన్ పోటీ చ చేసిన పులివెందులతో కలిపి కేవలం మూడు స్థానాలకే పరిమితమైంది. దివంగత వైఎస్ఆర్ హయాం నుంచి జిల్లాలో ఆ పార్టీ అంత దారుణంలో ఎప్పుడూ ఓడిపోలేదు. 2014-19 మధ్య కాలంలో జిల్లాలలో వైసీపీ ఎమ్మెల్యేలు ఆడిందే ఆట.. పాడిందే పాట అన్నట్లు నడిపించారు. వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోకుండా మట్టి నుంచి మద్యం వరకు అన్నిట్లో కోట్లకు కోట్లు వెనకేసుకున్నారన్న ఆరోపణలున్నాయి .. ఆ అక్రమ భాగోతాలపై కూటమి సర్కారు ప్రత్యేకంగా దృష్టి సారిస్తుండటంతో అరెస్టుల వైసీపీ నేతలు ఇప్పుడు అండర్గ్రౌండ్లోకి వెళ్లి పోతున్నారంట.
రాచమల్లు కూడా అందుకే ఎవరికీ అందుబాటులో లేకుండా పోయి.. నెటిజన్ల చేతిలో ట్రోల్ అవుతున్నారు. అప్పట్లో అధికారం అడ్డం పెట్టుకొని కూటమి నేతలపై కక్ష సాధింపు చర్యలు చేపట్టిన ఆ మాజీ ఎమ్మెల్యే శివప్రసాదరెడ్డిపై ఇప్పుడు ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి ప్రత్యేక దృష్టి సారిస్తూ ఆయన అవినీతి అంతు తేలుస్తానంటున్నారు. మరి చూడాలి నియోజకవర్గంలో మాఫియా డాన్గా పేరుపడ్డ రాచమల్లు వారి ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో?