Home Minister Anitha Comments on Jagan: వైసీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత మరోసారి ఫైరయ్యారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ జగన్ పై మండిపడ్డారు. నేరం చేసినవాళ్లు తప్పించుకోలేరన్నారు. వారికి శిక్ష పడుతుందన్నారు. మహిళల భద్రత గురించి జగన్ మాట్లాడుతుంటే విడ్డూరంగా ఉందంటూ ఆమె విమర్శించారు.
హోంశాఖపై సచివాలయంలో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. సమీక్ష అనంతరం హోంమంత్రి మీడియాతో మాట్లాడుతూ.. ‘గత వైసీపీ ప్రభుత్వం సీసీ కెమెరాల బిల్లులు కూడా చెల్లించలేదు. దీంతో ఆ ఐదేళ్లు రాష్ట్రంలో సీసీ కెమెరాల నిర్వహణ కూడా సరిగాలేదు. మహిళల భద్రత గురించి వైసీపీ నేతలు మాట్లాడుతుంటే హాస్యాస్పదంగా ఉంది. గతంలో దాదాపు 15 వేల సీసీ కెమెరాలు ఉంటే వాటిలో చాలా వరకు పనిచేయట్లేదు. మరికొన్ని సీసీ కెమెరాలు కొత్తవి కావాలి. రాష్ట్రంలో చాలా చోట్ల సీసీ కెమెరాలు లేక నేరాలు జరుగుతున్నాయి. రద్దీగా ఉండేటువంటి ప్రదేశాలు, నేరాలు జరిగేందుకు అవకాశం ఉన్న ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నాం. కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉంటుంది. నేరస్థులు తప్పించుకోకుండా చూడాలన్నదే మా ముఖ్య ఉద్దేశం. పెండింగ్ బిల్లులు రూ. 11 కోట్లు వెంటనే క్లియర్ చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. అదేవిధంగా పోలీస్ శాఖలో కొత్త వాహనాలను కొనుగోలు చేసేందుకు అనుమతించారు.
Also Read: కడపలో తీవ్ర విషాదం.. సైకిల్పై బడికి వెళ్తుండగా మీద పడిన విద్యుత్ తీగలు.. విద్యార్థి మృతి
గంజాయి సాగు, రవాణాలను గుర్తించి చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. గంజాయి నియంత్రణకు రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీ నిర్వహించేందుకు నిర్ణయించాం. యాంటి నార్కోటిక్స్, టాస్క్ ఫోర్స్ కూడా ఏర్పాటు చేశాం. సైబర్ నేరాల సంఖ్య ఎక్కువగా పెరిగిందని, దీన్ని అరికట్టేలా ప్రతి జిల్లాలో సైబర్ క్రైమ్ స్టేషన్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నాం’ అంటూ ఆమె పేర్కొన్నారు.