TS High Court: జన్వాడ ఫామ్ హౌజ్ కొన్ని నెలలుగా రాజకీయాల్లో దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. జీవో 111 నిబంధనలకు విరుద్ధంగా మాజీ మంత్రి కేటీఆర్ ఈ జన్వాడలో నిర్మించారనే ఆరోపణలు కొన్నాళ్లుగా వస్తున్నాయి. కాగా, బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఈ ఆరోపణలను ఖండిస్తున్నది. ఆ ఫామ్ హౌజ్ కేటీఆర్ది కాదని వాదిస్తున్నది. తాజాగా, ఈ ఫామ్ హౌజ్ కూల్చివేతకు సంబంధించిన పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో వాదనలు ముగిశాయి. హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హైడ్రాను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. వేగంగా విస్తరిస్తున్న మహానగరం హైదారాబాద్ విపత్తులు, అక్రమ కట్టడాలు, ఇతర సమస్యలను వేగంగా ఎదుర్కోవడానికి హైడ్రాను ఏర్పాటు చేశారు. రాజధాని నగరంలో ఆక్రమణలను సత్వరమే గుర్తించి వాటిని అడ్డుకోవడం హైడ్రా లక్ష్యాల్లో ఒకటిగా ఉన్నది. హైడ్రా రూపుదాల్చిన స్వల్ప సమయంలోనే వేగంగా తన పని తాను చేసుకుంటూ దూసుకుపోతున్నది. కుంటలు, చెరువులను అక్రమంగా ఆక్రమించి నిర్మించిన కట్టడాలను కూల్చివేస్తున్నది. ఇదే క్రమంలో జన్వాడ ఫామ్ హౌజ్ చర్చ కూడా జరిగింది. జన్వాడ ఫామ్ హౌజ్ జీవో 111కు విరుద్ధంగా నిర్మించారనే ఆరోపణలకు తోడు.. హైడ్రా త్వరలోనే ఈ ఫామ్ హౌజ్ను కూల్చేసే ఛాన్స్ ఉందని చర్చ జరిగింది.
ఈ నేపథ్యంలోనే జన్వాడ ఫామ్ హౌజ్ యజమాని ప్రదీప్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించాడు. తమ ఫామ్ హౌజ్ నిబంధనలకు లోబడే ఉన్నదని, తన ఫామ్ హౌజ్, పొలం ఉస్మాన్ సాగర్ ఎఫ్టీఎల్ పరిధిలో లేదని తన పిటిషన్లో పేర్కొన్నాడు. ప్రతివాదులుగా తెలంగాణ ప్రభుత్వం, హైడ్రా కమిషనర్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్, లేక్ ప్రొటెక్షన్ కమిటీ సభ్యులు, శంకర్పల్లి రెవెన్యూ అధికారి.. తదితరులను చేర్చారు.
Also Read: Minister Komatireddy: హైడ్రాపై కేటీఆర్ చాలెంజ్లు అవసరంలేదు: మంత్రి కోమటిరెడ్డి
నీటి పారుదల శాఖకు చెందిన కొందరు అధికారులు ఇటీవలే తన ఫామ్ హౌజ్ పరిశీలించారని ప్రదీప్ రెడ్డి కోర్టుకు దృష్టికి తీసుకువచ్చాడు. ఎఫ్టీఎల్ పరిధిలో తన ఫామ్ హౌజ్ లేదని, వారికి ఆధారాలు చూపించి మరీ వివరించానని తెలిపాడు. అయితే, అధికారులు మాత్రం తనకు విరుద్ధంగా వాదించారని, తన ఫామ్ హౌజ్ ఎఫ్టీఎల్ పరిధిలోనే ఉన్నదని చెప్పారని పేర్కొన్నాడు. అయితే, రాజకీయ కారణాలతో తన ఫామ్ హౌజ్ను కూల్చేయాలని ప్రయత్నాలు జరుగుతున్నాయని వివరించాడు. తన ఫామ్ హౌజ్ కూల్చవద్దని విజ్ఞప్తి చేశాడు.
కాగా, హైకోర్టు హైడ్రా గురించి కీలక ప్రశ్నలు సంధించింది. హైడ్రాను ఏ ప్రాతిపదికన ఏర్పాటు చేశారని, దాని చట్టబద్ధత ఏమిటని, పరిమితులు ఏమిటని ప్రశ్నించింది. అయితే, ఆక్రమణలను అడ్డుకునే లక్ష్యంతో హైడ్రా ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలిపింది. ఇక నిర్మాణాలకు ఒక శాఖ అనుమతులు ఇస్తుంటే.. మరో శాఖ కూల్చివేస్తున్నదా? అని పేర్కొంది. అన్ని డాక్యుమెంట్లను పరిశీలించాలని హైడ్రాను ఆదేశించింది. ఇప్పటి వరకు ఎన్ని కట్టడాలను కూల్చివేసిందని, అందుకు పాటించిన నిబంధనలు ఏమిటో తెలియజేయాలని అడిగింది. పూర్తి వివరాలను అందించాలని ఏఏజీని హైకోర్టు ఆదేశించింది. అలాగే.. జన్వాడ్ ఫామ్ హౌజ్ను రేపటి వరకు కూల్చివేయవద్దని, గురువారం వరకు హైకోర్టు స్టే విధించింది.