Botsa Satyanarayana taken oath as MLC(Political news in AP): మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు. బుధవారం మండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు తన చాంబర్ లో బొత్సతో ప్రమాణం చేయించారు. మూడేళ్లపాటు బొత్స ఎమ్మెల్సీగా కొనసాగనున్నారు. ప్రణాణస్వీకారం అనంతరం బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు.
‘శాసన మండలి సభ్యుడిగా నన్ను ఏకీగ్రీవంగా ఎన్నుకోవడం సంతోషంగా ఉంది. జగన్ మోహన్ రెడ్డి నాపై ఉన్న నమ్మకంతో నాకు ఈ అవకాశాన్ని ఇచ్చారు. అసెంబ్లీ, మండలిలో ప్రజల కోసం వైసీపీ తరఫున పోరాటం చేస్తాం. ప్రజల గొంతుకగా సభలో వ్యవహరిస్తాం. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని ఖచ్చితంగా అమలు చేసి చూపించాలి. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించినప్పుడు మేం ఢిల్లీ వెళ్లి నిరసన తెలిపాం. ఏపీలో జరుగుతున్న దమన కాండను దేశానికి చాటి చెప్పాం. తప్పు చేస్తే ఎవరికైనా శిక్ష పడాల్సిందే. కేసులు పెడుతున్నారు.. పెట్టుకోనివ్వండి. ప్రభుత్వంలో ఉన్నది వాళ్లే కదా.. విచారణలు ఏం చేస్తారో వాళ్ల ఇష్టం’ అంటూ బొత్స పేర్కొన్నారు.
Also Read: బాబు ప్లాన్ వర్కవుట్ అయితే ఏపీ కి నిధుల కొరత ఉండదిక..
అంతకుముందు ఆయన వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికైన బొత్స సత్యనారాయణను జగన్ అభినందించారు. బొత్సతోపాటు పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు కూడా కలిశారు.
ఇదిలా ఉంటే.. బొత్స సత్యనారాయణ విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కూటమి తరఫున అభ్యర్థిని బరిలో నిలిపేందుకు ప్రయత్నం చేసి, చివరకు ఎన్నికలకు దూరంగా ఉన్నారు. ఇండిపెండ్ అభ్యర్థి కూడా చివరలో తన నామినేషన్ ను విత్ డ్రా చేసుకోవడం బొత్స ఎన్నిక ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించిన విషయం తెలిసిందే.