Happy delivary to a woman in Garla mandal by Ambulence staff : ఆపత్కాలంలో రోగులను సకాలంలో ఆసుపత్రులకు చేర్చడంలో 108 అంబులెన్స్ సర్వీసులు ప్రాణ దాతలుగా మన్ననలు అందుకుంటున్నాయి. ఎక్కడ రోడ్డు ప్రమాదం జరిగినా సకాలంలో స్పందించి రోగులకు మెరుగైన సేవలను అందించడంలో అంబులెన్స్ లు ఎప్పుడూ ముందుంటాయి. అయితే ఒక్కో సందర్భంలో ట్రాఫిక్ జామ్ అవ్వడం వలనో లేక ఇంకేదో సాంకేతిక కారణాలతోనో ఆలస్యంగా వస్తే మాత్రం ప్రతి ఒక్కరూ అంబులెన్స్ సేవలను ట్రోలింగ్ చేస్తుంటారు. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తూతూ మంత్రంగా వీటి నిర్వహణను నడిపిస్తున్నారు. కాలం చెల్లిన వాహనాలను ఉపయోగిస్తూ వారి జీత భత్యాలకు తాత్సారం చేస్తూ వస్తుంటాయి. అయినా తమ కష్టాలను మర్చిపోయి సిబ్బంది మాత్రం సేవా తత్పరత చాటుకుంటుంటారు.
గార్ల మండలంలో ఘటన
మహబూబ్ నగర్ జిల్లా గార్ల మండలంలో జరిగిన ఈ సంఘటనతో జనానికి అంబులెన్స్ నిర్వాహకులపై గౌరవం పెరుగుతుంది. ఇప్పుడు అంబులెన్స్ సిబ్బంది సేవా భావానికి అంతా హ్యాట్సాఫ్ చెబుతున్నారు. గార్ల మండలం గంపలగూడెంకు చెందిన ఓ మహిళకు పురిటి నొప్పులు మొదలయ్యాయి. కుటుంబ సభ్యులు ఆందోళనగా అప్పటికప్పుడే 108 అంబులెన్స్ సర్వీసుకు ఫోన్ చేశారు. వెంటనే 108 సిబ్బంది టీమ్ ప్రసవ వేదన పడుతున్న ఆ మహిళను అంబులెన్స్ ఎక్కించారు. దారిలో ఆ మహిళ పురిటినొప్పులు భరించలేక మధ్యలోనే శిశువును కనింది. అయితే డాక్టర్లు, నర్సులు లేకుండానే 108 అంబులెన్స్ కు చెందిన ఈఎంటీ శ్రీనివాస్ మరో ఆలోచన లేకుండా తానే నర్సులా మారి ఆ మహిళకు సుఖ ప్రసవం అయ్యేలా చేశాడు. ప్రాణాపాయం లేకుండా ఆ మహిళ ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చింది.
నెటిజన్స్ పొగడ్తలు
ప్రస్తుతానికి తల్లీ బిడ్డా ఇద్దరూ క్షేమం. తమ బిడ్డకు సకాలంలో ప్రసవం చేసి ప్రాణాపాయ స్థితినుంచి చాకచక్యంగా కాపాడి సమయస్ఫూర్తితో వ్యవహరించిన ఈఎంటీ శ్రీనివాస్, పైలెట్ సైదులకు ఆ మహిళ కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు. వాళ్ల పని కాకపోయినా ప్రమాదంలో ఉన్న మహిళను మానవత్వంతో కాపాడిన అంబులెన్స్ సిబ్బందిని నెటిజన్స్ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఇలాంటి స్ఫూర్తి నేటి సమాజానికి కావాలని..తల్లీ బిడ్డలు క్షేమంగా ఉండటం శుభదాయకం అని అందరూ వేనోళ్ల పొగుడుతున్నారు.