ICC rates T20 World Cup 2024 pitches in Tarouba & New York unsatisfactory: టీ 20 ప్రపంచకప్ 2024 మెగా టోర్నమెంట్ కు అమెరికా, వెస్టిండీస్ దేశాలు సంయుక్తంగా ఆతిథ్యమిచ్చాయి. అయితే రెండు చోట్లా ఐసీసీ ఏర్పాటు చేసిన పిచ్ లపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అంతర్జాతీయంగా పేరున్న క్రికెటర్లందరూ అక్కడ దెబ్బలు తగిలించుకుని గాయాలపాలయ్యారు. చాలామంది ఇలా వెళ్లి, అలా అవుట్ అయిపోయి వచ్చారు.
న్యూయార్క్లో 8 మ్యాచ్ లు జరిగాయి. ఇక్కడ మొదటి ఇన్నింగ్స్ ఆడిన జట్ల సగటు స్కోరు 107.6 పరుగులుగా ఉంది. భారత్-పాకిస్తాన్ మ్యాచ్ కూడా ఇక్కడే జరిగింది. అది కూడా ‘లో స్కోరు’ నమోదైంది. క్రికెట్ నిపుణులతో పాటు క్రికెట్ అభిమానులు సైతం పిచ్ ల తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
అయితే చాలా చోట్ల స్లో పిచ్ లు కావడం, అన్యూహంగా బంతి బౌన్స్ అవడం, లేదా టర్న్ కావడంతో బ్యాటర్లు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బ్యాటింగ్ చేశారు. ఏ జట్టు కూడా భారీ స్కోర్లు చేయలేదు. ఇకపోతే ఈసారి టీ 20 ప్రపంచకప్ పోటీలు ఎంతో చప్పగా సాగాయనే విమర్శలు వచ్చాయి. మ్యాచ్లకు రిఫరీలుగా వ్యవహరించిన రంజన్ మదుగలే, డేవిడ్ బూన్, జెఫ్ క్రోవ్, రిచీ రిచర్డ్సన్ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు.
ఈ నేపథ్యంలో ఐసీసీ ఈ పిచ్ లపై నివేదికలు కోరింది. మొత్తానికి టోర్నీ ముగిసిన దాదాపు 50 రోజుల తర్వాత నసావు కౌంటీ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్ల పిచ్లకు ఐసీసీ రేటింగ్స్ ఇచ్చింది. 6 మ్యాచ్ లకు సంత్రప్తికరం, 2 మ్యాచ్ లకు మాత్రం అసంత్రప్తికరం అని తెలిపింది. దీంతో అభిమానులు భగ్గుమంటున్నారు.
Also Read: ఐపీఎల్ ఫ్రాంచైజీలకు.. ఎంత లాభం వస్తుంది?
మొత్తంగా చూస్తే ఐసీసీ టీ20 వరల్డ్ కప్లో మొత్తం 52 మ్యాచ్లు జరిగాయి. వీటిలో కేవలం 3 మ్యాచ్ల పిచ్ లు మాత్రమే అసంతృప్తికరం అని తెలిపింది. ఇందులో ఒకటి ట్రినిడాడ్లో ఆఫ్ఘనిస్తాన్ -దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన సెమీ-ఫైనల్ మ్యాచ్ గా తెలిపింది. ఈ మ్యాచ్లో ఆఫ్ఘాన్ కేవలం 56 పరుగులకే ఆలౌట్ అయ్యిందని పేర్కొంది. మరిలాంటి అధ్వానమైన పిచ్ ల మీద ఆడటం వల్లే కదా.. ఆఫ్గాన్ ఓడిపోయింది. అందుకెవరు బాధ్యత వహిస్తారని అభిమానులు ప్రశ్నిస్తున్నారు.