Crowd Reduced in Tirumala Tirupati Temple: ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల భక్తులకు శుభవార్త. తిరుమలలో భక్తుల రద్దీ తగ్గడంతో వీధులన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి. గత వారం రోజులుగా కిటకిటలాడిన తిరుమల తిరుపతి క్షేత్రం ప్రస్తుతం భక్తులు కనిపించకపోవడంతో బోసిపోయింది. వరుసగా సెలువు దినాలతోపాటు రాఖీ పూర్ణమి సందర్భంగా శ్రీవారి దర్శనానికి గంటల సమయం పట్టేది. బుధవారం ఉదయం శ్రీవారిని సులువుగా దర్శించుకునేందుకు అవకాశం ఉందని ఆలయ అధికారులు చెబుతున్నారు. రద్దీ తక్కువగా ఉండడంతో స్వామివారిని దర్శించుకునేందుకు ఎక్కువమంది ఉత్సాహం చూపుతున్నారు. ప్రధానంగా స్థానికులు శ్రీవారి దర్శనానికి వస్తున్నట్లు సమాచారం.
తిరుమలలోని వైకుంఠం కాంప్లెక్స్లో ఒక కంపార్ట్ మెంట్లో మాత్రమే భక్తులు శ్రీవారి దర్శనం కోసం లైన్లో నిల్చున్నారు. ఇక, ఉచిత దర్శనానికి క్యూలో టోకెన్లు లేకుండా ప్రవేశించే భక్తులకు శ్రీవారి దర్శనం ఎనిమిది గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. టైమ్ స్లాట్ దర్శనం కోసం రూ.300 కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం కేవలం రెండు గంటల్లోనే పూర్తవుతుందని అధికారులు చెబుతున్నారు.
తిరుమల శ్రీవారిని 73,082 మంది భక్తులు దర్శించుకున్నారు. ఇందులో 27,972 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకొని మొక్కులు చెల్లించుకున్నారని అధికారులు చెప్పారు. ఇక, తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం లెక్కించగా..రూ. 4.46 కోట్ల ఆదాయం సమకూరినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.
Also Read: పోలవరం ప్రాజెక్టుకు కీలకంగా మారిన కొత్త డీపీఆర్ ఆమోదం!
ఇదిలా ఉండగా, అక్టోబర్ 4 నుంచి 12వ తేది వరకు తిరుమల దేవస్థానంలో నవహ్నిక సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. అక్టోబర్ 3వ తేదీన సాయంత్రం అంకురార్పణతో ప్రారంభమవుతాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రతి రోజు ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు వాహన సేవలు ఉండనున్నాయి.