Pakistan allocates Rs.12 lakhs for cats to hunt rats in Parliament:..public fire: ఒక పక్క పేదరికంతో బాధపడుతోంది ఆ దేశం. ఆర్థికంగా చితికిపోయింది. నిత్యావసరాలన్నీ కొండెక్కి కూర్చొన్నాయి. ఇప్పటికే అక్కడ లీటర్ పెట్రోలు రెండు వందల నుంచి మూడు వందలయింది. పాలు, గుడ్లు, చికెన్ , మటన్ ఇలా ఏవి కొనాలన్నా నాలుగింతలు పెరిగిపోయాయి. నిరుద్యోగ సమస్య భూతం వెంటాడుతోంది. దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయింది. మరో పక్క ఉగ్రవాద సమస్య, రోజురోజుకూ ద్రవ్యోల్మణం పెరిగిపోతోంది. పేదవారు ఎక్కువగా తినే గోధుమలు కూడా దారుణంగా రేట్లు పెరిగిపోవడంతో రోటీలకు కూడా నోచుకోలేని స్థితిలో పేదలు కొట్టుమిట్టాడుతున్నారు.
ప్రకృతి కన్నెర్ర
ఇదిలా ఉంటే అక్కడ ప్రకృతి కూడా పాకిస్తాన్ పై కన్నెర్ర చేసింది. అష్టకష్టాల నిర్బంధంలో పూర్తిగా చిక్కుకుపోయింది పాకిస్తాన్. ఇదిలా ఉంటే పాకిస్తాన్ పార్లమెంట్ కు కొత్తగా ఓ సమస్య వచ్చి పడింది. పార్లమెంట్ పరిధిలో విలువైన ఫైళ్లు, డాక్యుమెంట్లను ఎలుకలు, పందికొక్కులు కొరికేస్తున్నాయి. దీనితో ఎలుకల నివారణ ఎలా అని ఆలోచించిన పాక్ ప్రభుత్వం పిల్లులను పార్లమెంట్ పరిధిలో పెంచడం ప్రారంభించింది. వాటికి సంరక్షించేందుకు ఓ ఉద్యోగి, ఆయనకు నెల జీతం ఏర్పాట్లు చేశారు. పాక్ లో మనుషులకు లేకపోయినా పిల్లులకు మాత్రం నిత్యం ఖరీదైన పాలు ఏర్పాట్లు చేసింది అక్కడి ప్రభుత్వం. అయితే ఈ సారి పార్లమెంట్ బడ్జెట్ లో పిల్లుల నిర్వహణకు పాక్ ప్రభుత్వం ఏకంగా రూ.12 లక్షలు కేటాయించింది. పిల్లులకు ప్రత్యేకంగా శిక్షణ కూడా ఇస్తున్నారు. ఆ శిక్షణలో అవి ఎలుకలను ఎలా పట్టుకోవాలో నేర్పుతున్నారు. ఇదెక్కడి విడ్డూరం అంటూ జనం పాక్ ప్రభుత్వంపై మండిపడుతున్నారు.
సామాన్యుల ఆగ్రహం
ఇప్పుడు పాక్ లో ఇదే హాట్ టాపిక్ గా మారింది. ఎలుకల నివారణకు వేరే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని ప్రజాసంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సామాన్యులు పాలు తాగేందుకు సైతం నోచుకోలేకపోతున్నారని..పెరిగిన నిత్యావసరాలు పట్టించుకోకుండా ఇలా పిల్లుల మీద డబ్బులు తగలేయడమేమిటని ప్రశ్నిస్తున్నారు అంతా. ప్రజా సంక్షేమం పట్టించుకోకపోతే పాక్ ప్రభుత్వం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని..అంతర్యుద్ధానికి దారితీయకముందే పాక్ ప్రభుత్వం మేల్కొనాలంటున్నారు పబ్లిక్.