ICC Women’s T20 World Cup Shifted from Bangladesh to UAE: అన్నీ అనుకున్నట్టు జరిగితే మహిళా టీ 20 ప్రపంచకప్ పోటీలకు బంగ్లాదేశ్ ఆతిథ్యమిచ్చేది. కానీ పరిస్థితులు అక్కడ అనుకూలంగా లేకపోవడంతో విధి లేని పరిస్థితుల్లో ఐసీసీ వేదికను మార్చింది. దీంతో మహిళా టీ 20 ప్రపంచకప్ పోటీలు యూఏఈలో జరగనున్నాయి.
అయితే బంగ్లాదేశ్లో టోర్నమెంట్ నిర్వహించేందుకు వివిధ దేశాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఆ దేశంలో క్రికెట్ కి ఆదరణ పెంచాలని మహిళా టీ 20 ప్రపంచకప్ పోటీలు నిర్వహించాలని భావించారు. అయితే రిజర్వేషన్ల కోసం యువత చేపట్టిన ఆందోళన ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. తీవ్ర పర్యవసనాలకు దారితీసింది. కొన్ని వందల మంది మరణించారు. చివరికి బంగ్లా ప్రధాని షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి భారత్ లో ఆశ్రయం పొందేవరకు పరిస్థితులు వచ్చాయి.
కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా పరిస్థితులు అదుపులోకి రాలేదు. దీంతో వేదికను ఐసీసీ మార్చక తప్పలేదు. అయితే ప్రపంచకప్ పోటీలు నిర్వహించేందుకు శ్రీలంక, జింబాబ్వే పోటీ పడ్డాయి. ఐసీసీ పాలకవర్గం మాత్రం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) వైపు మొగ్గు చూపించింది. అక్కడే నిర్వహిస్తామని ప్రకటించింది.
బంగ్లాదేశ్లో ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్ టోర్నీ నిర్వహించకపోవడం చాలా బాధ కలిగించిందని ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఒక ప్రకటనలో తెలిపారు. అనుకొని పరిస్థితుల వల్ల వేదిక మార్చక తప్ప లేదు. చిరస్మరణీయ టోర్నీ నిర్వహించే అవకాశం బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు కోల్పోయిందని పేర్కొన్నారు.
Also Read: లక్నో బౌలింగ్ కోచ్గా సూపర్ బౌలర్!
మే, 2024లో ఐసీసీ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం అక్టోబరు 3, 2024 నుంచి 20వ తేదీ వరకు మహిళా టీ20 ప్రపంచకప్ పోటీలు జరగనున్నాయి. అయితే వారం రోజులు ముందుగానే అంటే సెప్టెంబరు 27 నుంచి వార్మప్ మ్యాచ్ లు మొదలవనున్నాయి. ఇప్పుడు యూఏఈకి వేదిక మారడంతో అన్ని దేశాల క్రికెటర్లు మానసికంగా యూఏఈలో ఆడేందుకు సిద్ధమవుతున్నారు.
ఇటీవల శ్రీలంకలో జరిగిన ఉమన్స్ ఆసియా కప్ ఫైనల్ లో భారత్ ని ఓడించిన శ్రీలంక ట్రోఫీ చేజిక్కించుకుంది. ఫైనల్ వరకు అద్భుతంగా ఆడిన టీమ్ ఇండియా అమ్మాయిలు, ఫైనల్ లో చేతులెత్తేశారు. మరి ప్రపంచకప్ లోనైనా బాగా ఆడి ట్రోఫీ తీసుకొస్తారని ఆశిద్దాం.