Three were killed in AP Road Accident: అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తాడిపత్రి మండలంలోని వంగనూరు వద్ద బొందలదిన్నె గ్రామంలో కారు, లారీ ఎదురెదురుగా ఢీకొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. బుధవారం ఉదయం జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
మృతులు తాడిపత్రి మండలంలోని గంధారగుట్టపల్లి గ్రామానికి చెందిన వ్యక్తులుగా గుర్తించారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారని పోలీసులు వెల్లడించారు. ఇందులో దంపతులు ప్రతాప్ రెడ్డి(25), ప్రమీల(22), మరో మహిళ వెంటకలక్ష్మి(45) ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వీరంతా శుభకార్యం నిమిత్తం కడప జిల్లా వేంపల్లికి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు.