Rajnath Singh : భారత్, చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలపై కేంద్రం దృష్టి పెట్టింది. అరుణాచల్ప్రదేశ్లోని తవాంగ్ సెక్టార్లో ఇరు దేశాల సైనికుల మధ్య తాజాగా ఘర్షణ చెలరేగాయి. ఈ నేపథ్యంలో.. చైనాతో వాస్తవాధీన రేఖ వెంబడి భద్రతా పరిస్థితులపై చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్… లెఫ్టినెంట్ జనరల్ అనిల్ చౌహాన్, త్రివిధ దళాధిపతులతో రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సమావేశం కానున్నారు. భవిష్యత్తు కార్యాచరణపై రాజ్ నాథ్ సింగ్ చర్చిస్తారని రక్షణశాఖ వర్గాలు తెలిపాయి. దీంతోపాటు ఈ వివాదంపై కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ పార్లమెంట్ ఉభయ సభల్లోనూ మాట్లాడతారని ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి.
విదేశాంగ మంత్రి జై శంకర్, ఆర్మీ జనరల్ చీఫ్ జనరల్ మనోజ్ పాండే, నౌకాదళాధిపతి అడ్మిరల్ హరికుమార్, ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌధరి .. రాజ్నాథ్తో జరిగే సమావేశానికి హాజరుకానున్నారు. మరోవైపు తవాంగ్లో భారత్- చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణపై భద్రతా బలగాలు ఇప్పటికే కేంద్ర రక్షణమంత్రికి తాజా వివరాలు ఇచ్చినట్లు రక్షణశాఖ వర్గాలు తెలిపాయి.
తవాంగ్ సెక్టార్లోని యాంగ్త్సె ప్రాంతం వద్ద ఈ నెల 9న భారత్-చైనా సైనికుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో రెండుదేశాల సైనికులు గాయపడినట్లు భారత సైన్యం ప్రకటించింది. ఈ క్రమంలోనే రక్షణ, విదేశాంగశాఖలు ఉన్నతస్థాయి సమావేశానికి సిద్ధమయ్యాయి. భారత్- చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలపై దృష్టిపెట్టాయి. గతంలో గల్వాన్ లోయలో జరిగిన ఘటనలను దృష్టిలో పెట్టుకుని కేంద్రం ప్రభుత్వం చైనాను కవ్వింపు చర్యలను నియంత్రించేందుకు ప్రయత్నాలు చేస్తోంది.