Development of tourism as an employment creation objective: Minister Jupalli Krishna Rao reveals: ఉమ్మడి వరంగల్ జిల్లాను టూరిజం హబ్గా తీర్చిదిద్దుతామని తెలంగాణ ఎక్సైజ్, టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మంగళవారం ఆయన మంత్రి సీతక్కతో కలిసి వరంగల్, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో పర్యటించారు. జిల్లాల పర్యటనలో భాగంగా వరంగల్కు చేరుకున్న మంత్రి జూపల్లి కృష్ణారావు చేరుకోగా.. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎంజీఎం జంక్షన్లోని రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించారు. దివంగత రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేసి జయంతి ఉత్సవాలను నిర్వహించారు. అనంతరం భూపాలపల్లి జిల్లాలోని కొడవటంచ శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అభివృద్ధి కోసం 12 కోట్ల రూపాయల నిధులతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
అనంతరం రేగొండ మండలం బుగులోని గుట్ట, పాండవుల గుట్టలను మంత్రి సీతక్కతో కలిసి పరిశీలించారు. పాండవుల గుట్ట ప్రాంతాన్ని టూరిజం స్పాట్ గా అభివృద్ధి చేసేందుకు అన్ని శాఖలతో కలిసి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తామని అన్నారు. గణపురం మండలంలోని గనపసముద్రం చెరువుకట్ట, కోటగుళ్లను పరిశీలించి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఇక ములుగు జిల్లాలోని రామప్ప రామలింగేశ్వర స్వామి ఆలయానికి చేరుకున్న మంత్రులకు, అర్చకులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికి వేద ఆశీర్వచనం అందించారు. అనంతరం స్వామివారికి మంత్రులు జూపల్లి కృష్ణారావు సీతక్క ప్రత్యేక పూజలు చేశారు.
Also Read: పండుగపూట విషాదం, కరెంట్ షాక్కి గురై దంపతులు మృత్యువాత..
అక్కడి నుండి నేరుగా లక్నవరం సరస్సును పరిశీలించి, సరస్సును అంతర్జాతీయ స్థాయిలో పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడంపై అధికారులతో అధ్యయనం చేశారు. వరంగల్, హనుమకొండ, భూపాలపల్లి, ములుగు జిల్లాలను కలుపుతూ టూరిజం హబ్గా మార్చడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. అంతేకాకుండా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించడం టూరిజం డెవలప్మెంట్ ద్వారా సాధ్యమవుతుందని, తద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుందని పేర్కొన్నారు మంత్రి. త్వరలోనే అన్ని శాఖల అధికారుల సమన్వయంతో వరంగల్ను టూరిజం హబ్గా చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తామన్నారు. పురాతన కట్టడాలు, చారిత్రక సంపద, కనువిందు చేసే జలాశయాలు, అటవీ సంపద కలిగిన ఉమ్మడి వరంగల్ జిల్లా ఎంతో ప్రత్యేకత కలిగి ఉందని కొనియాడారు. త్వరలోనే పర్యాటక కేంద్ర బిందువుగా వరంగల్ ను మారుస్తామని హామీ ఇచ్చారు.