BRS : జాతీయ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించడమే లక్ష్యంగా భారత్ రాష్ట్ర సమితి వేగంగా అడుగులు వేస్తోంది. దేశం సుభిక్షంగా ఉండాలని, బీఆర్ఎస్ పార్టీ విజయవంతం కావాలని కాంక్షిస్తూ సీఎం కేసీఆర్ ఢిల్లీలో రాజశ్యామల యాగం తలపెట్టారు. ఈ యాగం కోసం ప్రత్యేక యాగశాలను నిర్మించారు. మూడు హోమ గుండాలను ఏర్పాటు చేశారు. యాగశాల ప్రాంతంలో 300 మంది కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. 12 మంది ఋత్విక్కులు గణపతి పూజతో రాజశ్యామల యాగాన్ని ప్రారంభిస్తారు. తొలిరోజు పుణ్యవచనం, యాగశాల ప్రవేశం, చండీపారాయణం, మూలమంత్ర జపాలు నిర్వహిస్తారు. బుధవారం నవ చండీహోమం, రాజశ్యామల హోమం అనంతరం పూర్ణాహుతి కార్యక్రమాన్ని చేపడతారు. శృంగేరిపీఠానికి చెందిన గోపీకృష్ణ శర్మ, ఫణి శశాంకశర్మ ఆధ్వర్యంలో ఈ క్రతువు జరుగుతుంది. రాజశ్యామల, నవచండీ యాగాల్లో కేసీఆర్ సతీసమేతంగా పాల్గొంటారు.
ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయం ఏర్పాటు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. సర్దార్ పటేల్ రోడ్డులో బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయం ప్రారంభించనున్నారు. వాస్తుకు అనుగుణంగా కార్యాలయ భవనంలో మార్పులు, చేర్పులు చేశారు. కార్యాలయానికి అవసరమైన ఫర్నిచర్ తీసుకొచ్చారు. పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఢిల్లీతోపాటు దేశంలోని ప్రధాన నగరాల్లో ఫ్లెక్సీలు, హోర్డింగులు ఏర్పాటు చేశారు. ఢిల్లీ వీధుల్లో ‘కేసీఆర్ ఫర్ ఇండియా, దేశ్ కీ నేత కిసాన్ కీ భరోసా, అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ అనే నినాదాలతో హోర్డింగ్లు, ఫ్లెక్సీలు వెలిశాయి. అయితే బీఆర్ఎస్ కార్యాలయం ముందు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను ఎన్ఎండీసీ అధికారులు తొలగించారు. అనుమతి లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని అధికారులు తెలిపారు. మరోవైపు పార్టీ కార్యకలాపాలు విస్తరించేందుకు ఇతర రాష్ట్రాల్లోనూ బీఆర్ఎస్ కార్యాలయాలను ప్రారంభించే యోచనలో కేసీఆర్ ఉన్నారని తెలుస్తోంది.
పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవానికి రావాలని తెలంగాణ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ ఛైర్మన్లను కేసీఆర్ ఆహ్వానించారు. రాష్ట్రం నుంచి 450 మందికిపైగా ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. పార్టీ కేంద్ర కార్యాలయం ప్రారంభోత్సవానికి పలు పార్టీల నేతలతోపాటు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను ఆహ్వానించారు. జేడీఎస్ అధ్యక్షుడు కుమారస్వామి, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్, బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్, సినీ నటుటు ప్రకాశ్రాజ్ ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశముందని సమాచారం.
4 రోజులపాటు కేసీఆర్ ఢిల్లీలో మకాం వేసే అవకాశముందని బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. బుధవారం ఢిల్లీలో జరిగే సమావేశంలో పార్టీ ఎజెండా, కార్యకలాపాలపై రోడ్మ్యాప్ను గులాబీ బాస్ ప్రకటించే అవకాశం ఉంది. అదే రోజు మధ్యాహ్నం జాతీయ మీడియాతో జరిగే భేటీలో బీఆర్ఎస్ పార్టీ ఎందుకు ఏర్పాటు చేశామన్నది వివరిస్తారని తెలుస్తోంది.
బీఆర్ఎస్తో కలిసి పనిచేసేందుకు ఆసక్తి చూపుతున్న నేతలు, వివిధ రంగాలకు చెందిన వారితోనూ కేసీఆర్ భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం. పార్టీ కార్యకలాపాలను జాతీయ స్థాయిలో వేగవంతం చేసేందుకు 15 మందితో పొలిట్బ్యూరోను కేసీఆర్ ప్రకటిస్తారని వార్తలు వస్తున్నాయి. మరోవైపు వసంత్విహార్లో నిర్మాణంలో ఉన్న బీఆర్ఎస్ శాశ్వత కేంద్ర కార్యాలయాన్ని కేసీఆర్ పరిశీలించనున్నారు. మొత్తంమీద ఢిల్లీ కేంద్రంగా పార్టీ కార్యకలాపాలు నిర్వహించేందుకు కేసీఆర్ సన్నద్ధమయ్యారు.