Kavitha: లేనిపోని లీకులిచ్చి.. గొంతెత్తే ప్రతిపక్ష నేతల వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారంటూ మండిపడ్డారు కవిత. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎవరు ప్రశ్నించినా ఏజెన్సీలతో దాడులు చేయిస్తున్నారని అన్నారు. ఎన్ని అడ్డంకులు సృస్టించినా ముందుకే వెళ్తామని.. ఈ పోరాటంలో విశ్రాంతి తీసుకునే ప్రసక్తే లేదని సవాల్ చేశారు కవిత. సిస్టమ్ను మనం కాపాడుకుంటే.. ఆ సిస్టమ్ మనల్ని కాపాడుతుందన్నారు.
బీజేపీపై తిరుగుబాటుకు దేశాన్ని ఏకం చేస్తామన్నారు కవిత. కవులు, కళాకారులను ఏకం చేస్తామని.. తెలంగాణ తరహా ఉద్యమాన్ని దేశంలో తీసుకు వస్తామని.. జాగృతి సంస్థను దేశవ్యాప్తంగా విస్తరిస్తామన్నారు. బీజేపీపై పోరాటం విషయంలో వెనక్కి తగ్గేది లేదని చెప్పారు. తెలంగాణ ఆడపిల్లల కళ్ల నుంచి కన్నీళ్లు రావని.. నిప్పులు కురుస్తాయని అన్నారు కవిత.
దేశంలో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వాలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కూల్చేస్తోందని ఆరోపించారు. ఇప్పటికే 8 రాష్ట్రాల్లో ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికైన ప్రభుత్వాలను బీజేపీ కూల్చేసిందన్నారు. ప్రశ్నించిన వారిపై వ్యవస్థలతో దాడులు చేయిస్తూ మన సమయాన్ని వృథా చేస్తోందని మండిపడ్డారు. ప్రజలను జాగృతం చేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉందని.. ఈలోగా మన సత్తా చూపిద్దామంటూ.. తెలంగాణ జాగృతి సమావేశంలో సభ్యులకు పిలుపు ఇచ్చారు కవిత.