AP: కేంద్ర ప్రభుత్వం మరోసారి ఏపీకి హ్యాండ్ ఇచ్చింది. రాష్ట్ర విభజన హామీయైన ప్రత్యేక హోదాపై మళ్లీ పాత పాటే పాడింది. ప్రజలు ఎంత బలంగా కోరుకుంటున్నా.. కేంద్రం మాత్రం ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇచ్చేదేలే అంటోంది. అటు, పోలవరం సైతం గడువులోగా పూర్తి కావడం కష్టమేనని చెబుతోంది.
ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. ప్రత్యేక హోదా అంశం ప్రసుత్తం ఉనికిలోనే లేదని తేల్చి చెప్పింది. రాజ్యసభలో వైసీపీ ఎంపీ సుభాష్చంద్ర బోస్ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి రావు ఇంద్రజిత్ సింగ్ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. వివిధ కారణాలు, ప్రత్యేక పరిస్థితుల రీత్యా గతంలో జాతీయ అభివృద్ధి మండలి కొన్ని రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కల్పించింది కానీ, ఇప్పుడు ఏ రాష్ట్రాలకు స్పెషల్ స్టేటస్ ఇవ్వడం లేదని తెలిపింది. జనరల్ కేటగిరి రాష్ట్రాలు, ప్రత్యేక హోదా రాష్ట్రాల మధ్య పన్నుల పంపిణీకి సంబంధించి 14వ ఆర్థిక సంఘం ఎలాంటి వ్యత్యాసం చూపలేదని మంత్రి అన్నారు. నిధుల పంపిణీ ద్వారా వీలైనంత మేరకు ప్రతి రాష్ట్రానికి వనరులు అందించేందుకు కేంద్రం ప్రయత్నం చేస్తోందని.. నిధుల పంపిణీ తరువాత కూడా వనరుల లోటు ఉండే రాష్ట్రాలకు.. రెవెన్యూ లోటు పూడ్చేందుకు గ్రాంట్స్ అందిస్తోందని కేంద్ర మంత్రి వివరించారు.
ఇక, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, ఖర్చు, జాప్యంపై రాజ్యసభలో వైసీపీ ఎంపీ సుభాష్ చంద్రబోస్ అడిగిన ప్రశ్నకు కేంద్ర జల్శక్తి శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్ టుడు సమాధానం ఇచ్చారు. నిర్ణీత గడువులోగా పోలవరం పూర్తి కావడం కష్టమన్నారు. షెడ్యూల్ ప్రకారం 2024 మార్చి నాటికి పోలవరం పూర్తి కావాల్సి ఉందని.. కానీ, వివిధ కారణాల దృష్ట్యా ఈ గడువులోగా ప్రాజెక్టు పూర్తి కావడం కష్టమని స్పష్టం చేశారు.
మరోవైపు, టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ సైతం పోలవరంపై మరో ప్రశ్న అడగ్గా.. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి 2019 నుంచి ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం రూ.6,461.88 కోట్లు ఏపీ ప్రభుత్వానికి విడుదల చేసిందని చెప్పారు. 2016లో కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదం మేరకు 100 శాతం ఇరిగేషన్ కాంపోనెంట్ నిధులను కేంద్రం తిరిగి చెల్లిస్తుంది. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం చెల్లించాల్సిన మొత్తం రూ. 15,667.90 కోట్లు కాగా, అందులో ఇప్పటికే రూ. 13,226.04 కోట్లు ఏపీ ప్రభుత్వానికి చెల్లించామని, ఇంకా చెల్లించాల్సిన బ్యాలెన్స్ రూ. 2,441.86 కోట్లు మాత్రమేనని సభకు తెలియజేశారు కేంద్ర మంత్రి.