Polavaram Project DPR Funds(AP latest news): పోలవరం ప్రాజెక్టులో కేంద్ర మంత్రి మండలి ఆమోదముద్ర కీలకంగా మారింది. ఈ ఆమోదముద్ర పడితేనే నిధులు విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ ఆమోద ముద్ర లభించకపోవడంతో ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన రూ.1,615.47 కోట్ల నిధుల విడుదల ఆగిపోయింది. ఈ నిధుల కోసం కూటమి ప్రభుత్వం ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే సీఎం చంద్రబాబు రెండు రోజులు ఢిల్లీలో పర్యటించి ప్రధాని మోదీ, ఆర్థిక, జలవనరుల శాఖ మంత్రులు సీతారామన్, పాటిల్లతో చర్చించారు.
అయితే, కూటమి ప్రభుత్వం తొలి, మలిదశ జోలికి వెళ్లకుండా కేవలం 45.72 మీటర్ల స్థాయికి నీళ్లు నిల్వ చేసేందుకు అవసరమైన భూసేకరణతోపాటు పునరావాస కేంద్రాలకు సంబంధించిన విభజన చట్టం ప్రకారం నిధులు సమకూర్చేందుకు కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతుంది.
ప్రస్తుతం తొలి దశ పేరుతో రూ.30,436.95కోట్లకు కొత్త డీపీఆర్ సిద్ధంగా ఉంది. పోలవరం ప్రాజెక్టు అథారిటీ, కేంద్ర జలసంఘం, సాంకేతిక సలహా మండలి, రివైజ్డ్ కాస్ట్ కమిటీ, పెట్టుబడుల అనుమతి మండలి ఆమోదాలు ఉన్నాయి. అయితే కేంద్ర మంత్రిమండలి ఆమోదం కోసం రాష్ట్ర ప్రభుత్వం వేచి చూస్తోంది. పోలవరం పనులు ముందుకు తీసుకెళ్లాలంటే ఈ నిధులు అవసరం కానున్నాయి. ఈ ఆమోదం తెలిపితే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కానున్నాయి.
గతంలో 2010-11 ధరలతో రూ.16,010.45 కోట్లకు డీపీఆర్ ఆమోదం పొందింది. దీని ప్రకారం నిధులను కేంద్రం తిరిగి చెల్లించింది. అయితే తొలిదశ పేరుతో సిద్ధంగా ఉన్న డీపీఆర్ కేంద్ర ఆమోదం పొందితే రాష్ట్రానికి రూ.12,157.53 కోట్లు అందనున్నాయి.