Anurag Kashyap: ఇప్పుడు పాన్ ఇండియా సినిమాల హవా పెరుగుతున్నాయి. బాహుబలి నుంచి స్ఫూర్తి పొందిన మన దక్షిణాది మూవీ మేకర్స్ .. కె.జి.యఫ్, పుష్ప, కాంతార, కార్తికేయ 2 వంటి చిత్రాలతో పాన్ ఇండియా రేంజ్లో భారీ విజయాలను సొంతం చేసుకున్నారు. బాలీవుడ్ సినిమాలను తలదన్నేలా మన సినిమాలు నార్త్లోనూ రాణిస్తుండటం అక్కడ చాలా మందికి నచ్చటం లేదు. అయినా ఏమీ అనలేక సైలెంట్గా ఉంటున్నారు. కొంతమంది తన మనసులో బాధను ఏదో ఒక రూపంలో బయటకు చెప్పేస్తున్నారు. తాజాగా బాలీవుడ్ దర్శక నిర్మాత అనురాగ్ కశ్యప్ దక్షిణాది పాన్ ఇండియా సినిమాలపై తన ఆక్రోశాన్ని వెల్లగక్కారు.
‘‘కె.జి.యఫ్, కాంతార, పుష్ప వంటి సినిమాల వల్ల బాలీవుడ్ ఇండస్ట్రీ నాశనం అవుతుంది. ఎందుకంటే అలాంటి సినిమాలను కాపీ కొట్టడానికి ఇక్కడి వారు ప్రయత్నిస్తున్నారు. దాని వల్ల నష్టాల పాలవుతున్నారు. మరాఠీ సినిమా సైరత్ కూడా తక్కువ బడ్జెట్లో నిర్మితమై పాన్ ఇండియా రేంజ్లో పెద్ద సక్సెస్ అయ్యింది. ఆ తర్వాత మరాఠీ సినిమా ఇండస్ట్రీ అంతా అదే స్టైల్లో సినిమాలు చేయటానికి ప్రయత్నించటం వల్ల ఇండస్ట్రీ దెబ్బ తింటుంది. ఒరిజినాలిటీ పోతుంది. బాలీవుడ్ ఇండస్ట్రీకి ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు అవసరం లేదు. బాలీవుడ్కి ధైర్యాన్నిచ్చే సినిమాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది’’ అని అన్నారు అనురాగ కశ్యప్.