Karnataka Muda Scam| కర్ణాటక రాజకీయాల్లో చర్చనీయాశంగా మారిన భూ కుంభకోణం.. ముడా స్కాం కేసులో రాష్ట్ర హై కోర్టు సోమవారం కీలక తీర్పునిచ్చింది. భూ కుంభకోణం కేసులో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి సిద్దరామయ్యపై ఆగస్టు 29 వరకు ఎటువంటి చర్యలు తీసుకోవద్దని ట్రయల్ కోర్టుకు హై కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ముడా స్కాం కేసులో ఇటీవల కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లోట్.. సిఎం సిద్దరామయ్యని విచారణ చేసేందుకు అనుమతులు ఇవ్వడంతో ఈ కేసు వివాదాస్పదంగా మారింది. ఇప్పటికే ఈ కేసుపై ట్రయల్ కోర్టులో విచారణ జరుగుతుండగా.. సిఎం సిద్దరామయ్య హై కోర్టులో పిటీషన్ వేశారు. దీంతో హైకోర్టు ఈ కేసు విచారణ చేపట్టి.. ట్రయల్ కోర్టుని విచారణని వాయిదా వేయాల్సిందిగా ఆదేశించింది. సిద్దరామయ్య హై కోర్టులో వేసిన రిట్ పిటీషన్ లో ముడా స్కామ్, గవర్నర్ నిర్ణయాలపై అభ్యంతరం వ్యక్తం చేశారు.
గవర్నర్ గెహ్లోట్ తీసుకున్న నిర్ణయం చట్టవ్యతిరేకమని, ఈ కేసులో తనను విచారణ చేసేందుకు అనుమతులిచ్చేందుకు గవర్నర్ కు అధికారాలు లేవని సిద్దరామయ్య తన పిటీషన్ లో పేర్కొన్నారు. ఇది కేవలం గవర్నర్ అనాలోచిత నిర్ణయమని అన్నారు.
సిద్దరామయ్య పిటీషన్ వివరాలు:
కర్ణాటక హైకోర్టులో దాఖలు చేసిన రిట్ పిటీషన్ లో ముఖ్యమంత్రి సిద్దరామయ్య వాదిస్తూ.. ”నేను ఏ తప్పు చేయలేదు. నాపై జరిపే ప్రాసిక్యూషన్ నుంచి ఇంటెరిమ్ రిలీఫ్ ఇవ్వాల్సిందిగా పిటీషన్ లో కోరుతున్నాను. ప్రముఖ లాయర్ అభిషేక్ మను సింఘ్వి నా పిటీషన్ వాదిస్తారు. నా మనస్సాక్షిగా చెబుతున్నా.. నేను ఏ తప్పు చేయలేదు. 40 ఏళ్లుగా నేను రాజకీయాల్లో ఉన్నాను. మంత్రిగా సుదీర్ఘకాలం పనిచేశాను. నాపై ఒక్క అవినీతి మరక కూడా లేదు. ప్రజల ఆశీస్సులతో ఇంతకాలంగా రాజకీయాల్లో ఉన్నాను. నా రాజకీయ జీవితం ఓ తెరిచిన పుస్తకం. నా రాష్ట్ర ప్రజలకు కూడా తెలుసు నేను తప్పు చేయలేదని” అని అన్నారు.
ముఖ్యమంత్రి సిద్దరామయ్య తరపున సీనియర్ లాయర్ అభిషేక్ మనుసింగ్ సింఘ్వి వాదిస్తూ.. ”తన క్లైంటు సిద్దరామయ్య పై విచారణ చేయాలని గవర్నర్ దురుద్దేశ పూర్వకంగా ఆదేశాలిచ్చారని.. ఇదంతా రాజకీయ కక్షతో కర్ణాటక ప్రభుత్వాన్ని కూల్చడానికి చేస్తు్న్న కుట్ర” అని చెప్పారు.
అసలు ముడా ల్యాండ్ స్కామ్ ఏంటి?
మైసూరులో ని కేసరు గ్రామంలోని 3.16 ఎకరాల భూమిని సిద్దరామయ్య భార్య పార్వతి చట్టవ్యతిరేకంగా పొందారని ఆరోపిస్తూ.. ముగ్గురు సామాజిక కార్యకర్తలు గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. ఈ వివాదాస్పద భూమిని 2004లో సిద్దరామయ్య బావమరిది చట్టవ్యతిరేకంగా ఆక్రమించుకున్నారని.. 2014లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా సిద్దరామయ్య ఉండడంతో ఈ భూమిని రెవిన్యూ అధికారుల సహాయంతో తనపేరు మీద రిజిస్టర్ చేసుకున్నారని ఆరోపణలు చేశారు. అయితే ఈ భూమి రిజిస్ట్రేషన్ 1998లోనే జరిగినట్లు డాక్యుమెంట్స్ సృష్టించారు. ఆ తరువాత ఈ భూమిని సిద్దరామయ్య భార్యకు పుట్టింటి వాటా కింద ఇచ్చారు. ఈ వ్యవహారంలో రెవిన్యూ అధికారులు, ముఖ్యమంత్రి, ఆయన భార్య, ఆయన బావమరిది, అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు చేస్తూ.. గవర్నర్ థావర్ చంద్ గెహ్లోట్ కు ఫిర్యాదు చేశారు.
ముఖ్యమంత్రిని ముడా స్కామ్ కేసులో విచారణ చేసేందుకు అనుమతులివ్వాలని కోరారు. అందుకే నెల రోజుల క్రితం ముఖ్యమంత్రికి కర్ణాటక గవర్నర్ ఈ కేసులో షో కాజ్ నోటీసులు జారీ చేశారు. కానీ సిద్దరామయ్య నోటీసులపై స్పందించకపోవడంతో గవర్నర్ ఆయనను విచారణ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు.