Karnataka CM Siddaramaiah Comments: రాఖీ పండుగ రోజు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఎమోషనల్ కామెంట్స్ చేశారు. అయితే, మైసూరు నగర అభివృద్ధి సంస్థ -ముడా కుంభకోణంలో సిద్ధరామయ్య ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆయనను విచారించేందుకు ఆ రాష్ట్ర గవర్నర్ ఉత్తర్వులు జారీ చేయడంపై హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ తాజా పరిణామాలపై సిద్ధరామయ్య మాట్లాడారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో తానెప్పుడూ ఏ తప్పు చేయలేదన్నారు. అయితే, గవర్నర్ నిర్ణయం తననేమీ ఆశ్చర్యపరచలేదన్నారు. ఇవన్నీ కూడా రాజకీయ సవాళ్లలో భాగమేనన్నారు. ఇలాంటి సవాళ్లను మరింత జోష్ తో ఎదుర్కొంటానన్నారు.
Also Read: వందే భారత్ ఎక్స్ ప్రెస్ ఆహారంలో పురుగు.. ఏడాదిలోనే మూడోసారి.. రైల్వేశాఖ ఇంత నిర్లక్ష్యమా!
‘నేను రాజకీయంలోకి అడుగుపెట్టి 40 ఏళ్లు అవుతుంది. ఇన్నాళ్లే నా రాజకీయ జీవితం తెరిచిన పుస్తకం. ఇప్పటివరకు నేను ఎలాంటి తప్పు చేయలేదు. భవిష్యత్తులో కూడా చేయబోను. అయితే, బీజేపీ, జేడీఎస్ లు నా ప్రతిష్టను దెబ్బతీసేందుకు కుట్రలు చేస్తున్నాయి. 1984, ఆగస్టు 17న తొలిసారిగా నేను మంత్రి పదవిని చేపట్టాను. నా రాజకీయ జీవితంలో ఇప్పటివరకు ఒక్క మరక కూడా లేదు. నాపై విచారణ చేయాలంటూ గవర్నర్ ఇచ్చిన ఆదేశాలు రాజకీయంగా ప్రేరేపితమైనవి మాత్రమే. వాటిని న్యాయపరంగా, రాజకీయంగా ఎదుర్కొనడానికి నేను సిద్ధంగా ఉన్నాను’ అంటూ సిద్ధరామయ్య పేర్కొన్నారు.
”ముడా’ కోసం రాజీనామా చేయాల్సిన అవసరంలేదు. దీనిపై ఇటు న్యాయపోరాటం చేస్తూనే అటు రాజకీయంగానూ పోరాడుతా. రాజకీయంలో సవాళ్లు ఎదురవ్వడం మామూలే. రాజకీయంగా సవాళ్లు ఎదురైనప్పుడు మరింత ఉత్సాహంగా పనిచేస్తా. నన్ను రాజకీయంగా నాశనం చేస్తే కాంగ్రెస్ మొత్తం నాశనమవుతుందనే భ్రమలో బీజేపీ ఉంది.. అందుకే ఈ విధంగా చేస్తున్నారు. ఝార్ఖండ్, మహారాష్ట్ర, ఢిల్లీలో చేసినట్టుగా కర్ణాటకలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తున్నది’ అంటూ ఆయన పేర్కొన్నారు.
Also Read: ముడా స్కామ్.. గవర్నర్ ఆదేశాలు.. హైకోర్టుకు సీఎం సిద్ధరామయ్య
ఇదిలా ఉంటే.. ముడా కుంభకోణం కర్ణాటక రాజకీయాల్లో ఓ కుదుపు కుదిపేస్తున్నది. దీనిపై సీఎం సిద్ధరామయ్యను విచారించేందుకు గవర్నర్ థావర్ చంద్ అనుమతి ఇచ్చారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు ఆందోళనలు, నిరసనలకు దిగారు. కేంద్రం చెప్పినట్టే గవర్నర్ చేస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. ఇటు సీఎం సిద్ధరామయ్య కూడా ఈ వ్యవహారంపై హైకోర్టుకు వెళ్లారు. గవర్నర్ ఆదేశాలను సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై రేపో మాపో న్యాయస్థానంలో విచారణ జరగనున్నది. సిద్ధరామయ్య తరఫున సీనియర్ న్యాయవాదులు అభిషేక్ మను సింఘ్వీ, కపిల్ సిబల్ వాదనలు వినిపించనున్నారు.
కాగా, సీఎం సిద్ధరామయ్య సతీమణి పార్వతమ్మకు సంబంధించిన భూములను గతంలో మైసూర్ నగర అభివృద్ధి పనుల నిమిత్తం సేకరించారు. భూములను తీసుకున్నందుకు పరిహారంగా ఆమెకు మైసూర్ – విజయనగరలో భూములను కేటాయించారు. అయితే, దీనిపై బీజేపీ, జేడీఎస్ ఆరోపణలు చేస్తున్నాయి. సీఎం ఆదేశాలతోనే ముడా అధికారులు ఆమెకు ఖరీదైన భూములను కేటాయించారంటూ ఆ పార్టీలు వాదిస్తున్నాయి.