Insect In Vande Bharat Meals| భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన లగ్జరీ ట్రైన్ వందే భారత్ ఎక్స్ప్రెస్. ఈ సెమీ హైస్పీడ్ ట్రైన్ లో ప్రయాణీకులకు చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. తరుచూ భోజనం బాగోలేదని ఫిర్యాదులు అందుతూ ఉన్నాయి. అయితే ఈ సారి భోజనంలో పురుగు ఉన్నట్లు ప్రయాణికుడు ఫిర్యాదు చేశాడు. పై ఆ పురుగు ఉన్న భోజనాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు.
వివరాల్లోకి వెళితే.. అభయ్ సింగ్ సెంగార్ అనే యాత్రికుడు భోపాల్ నుంచి ఢిల్లీ-హజ్రత్ నిజాముద్దీన్ స్టేషన్ వరకు వందే భారత్ ఎక్స్ప్రెస్ లో ప్రయాణిస్తున్న సమయంలో ఈ షాకింగ్ ఘటన జరిగింది. రైలు ప్రయాణంలో ఝాన్సీ స్టేషన్ సమీపంలో ఉన్నప్పుడు అభయ్ సింగ్ కు వందే భారత్ ప్యాంట్రీ సిబ్బంది ఇచ్చిన ఆహారం ప్యాకెట్ తెరిచి చూడగా.. పైనే ఒక పురుగుపాకుతూ కనిపించింది. ఈ ఘటన గురించి అభయ్ సింగ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. వీడియోతో పాటు తన పోస్ట్ లో రైల్వే సిబ్బంది నిర్లక్ష్యం గురించి రాశాడు. ”భోజనంలో పురుగు చూసి నేను షాకయ్యాను. నాకు అది చూసి అసహ్యం వేసింది. రైల్వే సిబ్బందికి ఫిర్యాదు చేసినా.. నాకు వేరే భోజన ప్యాకెట్ ఇవ్వలేదు. నాకా సమయంల బాగా ఆకలి వేసింది. వాళ్లు మరో భోజన ప్యాకెట్ ఇవ్వకపోవడంతో విసుగు చెంది భోజనం చేసేందుకు మార్గమద్యలోనే ట్రైన్ నుంచి గ్వాలియర్ లో దిగేశాను.” అని రాశాడు.
సాధారణ ట్రైన్స్ లో ఇలాంటివి అప్పుడప్పుడూ జరుగుతూ ఉంటాయి. ఈ కారణంగానే రైల్వే భోజనం పరిశుభ్రంగా ఉండదు.. ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా.. మార్పు లేదు అనే భావన ప్రయాణీకుల్లో ఉంది. అయితే ఇదే పరిస్థితి వందే భారత్ ఎక్స్ప్రెస్ లో లాంటి లగ్జరీ ట్రైన్స్ లో కూడా ఉండడం రైల్వే సిబ్బంది నిర్లక్ష్యానికి తెలియజేస్తోంది. వందే భారత్ ఎక్స్ప్రెస్ లో కూడా ఈ ఒక్క ఏడాదిలో ఇలాంటి ఘటనలు మూడు సార్లు వెలుగులోకి వచ్చాయి. ఫిబ్రవరి 2024లో ఒక ప్రయాణికుడికి భోజనంలో కాక్రోచ్ కనిపించింది. జూలైలో మరొక ప్రయాణికుడు చనిపోయన కాక్రోచ్ కర్రీలో ఉన్నట్లు గుర్తించాడు. ప్రయాణికుల ఆరోగ్యం అంటే అంత నిర్లక్ష్యమా?.. వందే భారత్ ఎక్స్ ప్రెస్ లాంటి లగ్జరీ ట్రైన్ లో ఇలాంటి సర్వీస్ ఉంటుందని అసలు ఊహించలేదు అని ప్రయాణీకుడు రైల్వే శాఖను విమర్శిస్తూ పోస్టు చేశాడు.
ఈ ఘటనలపై రైల్వే శాఖ అధికారులు స్పందించారు. ”భోజనంలో పురుగు ఉందని మాకూ ఫిర్యాదు అందింది. ఈ విషయంలో విచారణ చేస్తున్నాం. ప్యాంట్రీ కాంట్రాక్టర్ పై తగిన చర్యలు తీసుకుంటాం. ఆహార భద్రత, పరిశుభ్రత అంశాలపై రైల్వే శాఖ సీరియస్ గా ఉంది. ఇలాంటి ఘటనల గురించి మాకు ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయి. ఆహార భద్రత, పరిశుభ్రతపై కఠిన నియమాలు తీసుకురావాల్సిన అవసరం ఉందని అనుకుంటున్నాను.” అని ఆర్ భట్టాచార్యా, ఐఆర్సిటీసి రీజినల్ మ్యానేజర్ తెలిపారు.
భారత రైల్వే శాఖ మరిన్ని వందే భారత్ ఎక్స్ ప్రెస్ ట్రైన్స్ తీసుకురాబోతోంది. కానీ ఇలాంటి ఘటనలు రిపీట్ కాకుండా చూడాల్సిన అవసరం ఉంది. ప్రయాణీకుల వద్ద టికెట్ లోనే భోజనం బిల్లు వసూలు చేసే వందే భారత్ లాంటి లగ్జరీ ట్రైన్స్ లో.. ముందు వారికి నాణ్యమైన భోజనం అందించే ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది.
Also Read:ట్రైనీ వైద్యురాలిపై హత్యాచారం..వెలుగులోకి సంచలన విషయాలు!