Husband Searches for Wife in See After Japan Tsunami: ఇండియాలో పెళ్లి బంధాలు పాశ్చాత్య పోకడలను పాటిస్తుంటే.. విదేశీయులు తమ జీవిత భాగస్వాములతో జీవితాలను పంచుకుంటున్నారు. పెళ్లి బంధం ఎలా ఉండాలో తెలియాలంటే.. మన పూర్వీకులను చూసి నేర్చుకోవాలి. మన తాతముత్తాతల కాలం నుంచి.. మన తల్లిదండ్రుల వరకూ.. ఎన్ని కష్టాలొచ్చినా.. జీవిత భాగస్వామిని అర్థం చేసుకుని, సర్దుకుపోయి జీవించినవారే. టెక్నాలజీ పెరిగింది. ఇద్దరూ అన్నింటా సమానం అన్నారు. అంతా బాగానే ఉంది కానీ.. ఇగో ఫీలింగ్స్ తో లేని పోని గొడవలకు పోయి.. జీవితాలను చిన్నాభిన్నం చేసుకుంటున్నారు. ఇలాంటి వారికి ఓ జపాన్ భర్త ఆదర్శంగా నిలుస్తున్నాడు. సునామీలో కొట్టుకుపోయిన తన భార్య అవశేషాల కోసం 13 ఏళ్లుగా వెతుకుతున్నాడు.
2011లో జపాన్ తీరంలో వచ్చిన ఆ విధ్వంసకరమైన సునామీని తలచుకుంటే.. ఇప్పటికీ వెన్నులో వణుకు పుడుతుంది. మార్చి 11, 2011న 9.1 తీవ్రతతో సునామి సంభవించింది. ఆనాటి సునామీలో 20 వేల మంది చనిపోగా.. 2500 మందికి పైగా తప్పిపోయారు. ఫుకుషిమా తీరంలో వచ్చిన సునామీలో చనిపోయిన తన భార్య కోసం యసువో తకమాట్సు అనే వ్యక్తి ఇప్పటికీ వెతుకుతూనే ఉన్నాడు. తన భార్య యుకో కు అంత్యక్రియలను సరిగ్గా నిర్వహించాలని అతను తపన పడుతున్నాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ.. ప్రతీవారం తన భార్య అవశేషాల కోసం స్కూబా డైవింగ్ కు వెళ్తాడు యసువో.
Also Read: టెక్సాస్లో దారుణం.. ఎన్నారై ఫ్యామిలీ, ముగ్గురు మృతి.. ఏం జరిగిందంటే..
ఓ నివేదిక ప్రకారం.. ఒక బ్యాంకులో పనిచేసే యుకో.. సునామి వచ్చిన సమయంలో తమ సిబ్బందితో కలిసి 30 అడుగుల ఎత్తులో ఉన్న పై కప్పు మీదికి వెళ్లింది. కానీ.. అలలు 60 అడుగుల ఎత్తు మేర రావడంతో.. ఆమె గల్లంతైంది. యసువో ఎంత ప్రయత్నించినా ఆచూకీ దొరకలేదు. అప్పటి నుంచి సమీపంలో ఉన్న మురికినీటి కాల్వ మొదలు.. జపాన్ తీరంలో స్కూబా డైవింగ్ చేశాడు. ఇప్పటి వరకూ కొన్ని వందల డైవింగ్ లు చేసి ఉంటాడు. తన భార్యకు చెందిన అన్ని అవశేషాలు దొరికిన తర్వాతే ఆమెకు అంత్యక్రియలు చేస్తానని ప్రతిజ్ఞ చేశాడు.
యసువోకి స్కూబా డైవింగ్ రాదు. అతనికి సునామీ శిథిలాలను తొలగించే ఒక వాలంటీర్ నేర్పించాడు. వారిద్దరూ కలిసి పదేళ్లకు పై నుంచే యుకో కోసం వెతుకుతున్నారు. అయితే సునామీ సంభవించిన కొన్ని నెలల తర్వాత ఆమె పనిచేసిన బ్యాంక్ వద్ద మొబైల్ ఫోన్ ను కనుగొన్నాడు. ఆ తర్వాత ఆమెకు సంబంధించిన ఆచూకీ ఏమీ తెలియలేదు. చివరిగా తన భర్తకు యుకో పంపిన మెసేజ్.. “మీరు బాగానే ఉన్నారా ? నేను ఇంటికి వెళ్లాలని అనుకుంటున్నాను” అని ఉంది.
1988లో తకమస్సు యూకోను కలిసారు. అప్పటికి ఆమె వయసు 25 సంవత్సరాలు. ఒనగావాలోని 77 బ్యాంక్ లో పనిచేస్తోంది. తకమస్సు జపాన్ గ్రౌండ్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్ లో పనిచేసేవాడు. ఆమె నవ్వు అంటే అతనికి ఎంతో ఇష్టం.
ఏదేమైనా చనిపోయిన భార్యకు అంత్యక్రియలు చేయడం కోసం.. ఏళ్ల తరబడి ఆమె అవశేషాల కోసం.. సముద్రంలో గాలించడం అనేది అతనికి తన భార్య పట్ల ఉన్న ప్రేమను తెలియజేస్తుంది. బ్రతికున్న భార్యనే చంపేస్తున్న రోజుల్లో.. ఇలాంటి భర్త కూడా ఉన్నారా అని ఈ విషయం తెలిసిన నెటిజన్లు ఆశ్చర్య పోతున్నారు.